
Ts News: కేంద్రంపై యుద్ధమంటూ.. అమిత్ షాను కలవగానే కేసీఆర్ యూటర్న్: భట్టి
హైదరాబాద్: రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. వారికి రూ.10 లక్షలు, రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 మంది అమరుల కుటుంబాలకు తక్షణమే సాయం చేయాలన్నారు. 1,200 మంది అమరులకు న్యాయం చేస్తామంటేనే ఆర్థిక సాయంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలా? వద్దా? అని సీఎం కేసీఆర్ను భట్టి నిలదీశారు.
‘‘కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధానికి వెళ్లినందుకు సంతోషమే. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపిన కేసీఆర్.. అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకుంటున్నారు. దిల్లీపై యుద్ధమే అని మరోసారి అమిత్ షాను కలుస్తానంటున్నారు. మరి ఇప్పుడు కూడా యూటర్న్ తీసుకుంటారా?యుద్ధం అని చెప్పి సీఎం కేసీఆర్ దిల్లీలో ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేకుండా పోయారు. వచ్చిన పంటంత రోడ్లపై వానలో తడుస్తుంది. కేసీఆర్ మాట మీద నిలబడాలి. అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకోవద్దు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఏడున్నరేళ్ల నుంచి నీటి వాటా తేల్చలేదని సీఎం అంటున్నారు. మరి సీఎం కేసీఆర్ ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వమని అడిగితే.. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు పోయినా డీపీఆర్లు ఇవ్వరు. కేంద్రం-ఏపీ-తెలంగాణకు మధ్య జరుగుతున్న అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.