AP News: పవన్‌ను సినీ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు: సజ్జల

ఏపీలో సినీ పరిశ్రమకు వైకాపా ప్రభుత్వం మంచి చేయాలని చూస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated : 28 Sep 2021 14:08 IST

అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమకు వైకాపా ప్రభుత్వం మంచి చేయాలని చూస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము చేస్తున్న మంచి పనులను అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బంది. ఆయనను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు. పవన్.. సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారు. పవన్‌ లాంటి వారితో ఇబ్బంది పడతామని సినిమా వారే భావిస్తున్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారు. ఈ విధానంతో పారదర్శకత సాధ్యం. సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమే.

అదే నిజమైతే అంతకంటే ఘోరం ఉందా?

బాహుబలి సినిమాకి తొలివారం 50 శాతమే టికెట్లు బుక్‌ అయినట్లు చూపారని అంటున్నారు. బాహుబలి టికెట్ల అంశంపై ఒకసారి చెక్‌ చేయాలి. అదే నిజమైతే అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉందా?బాహుబలికి మొదటి వారంలో సగం టికెట్లే అమ్ముడైనట్టు చూపితే మోసం చేసినట్టే. సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసు. పవన్‌ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం మటన్‌ షాపులు పెడతారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ షాపుల్లో శుభ్రత పెంచేందుకు ఆలోచిస్తోంది’’ అని సజ్జల అన్నారు.

మరోవైపు బద్వేలు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో దానిపై సజ్జల స్పందిస్తూ.. తాము ప్రతి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామన్నారు. ప్రజల అభిమానం, ఆదరణ పార్టీకి ఎప్పుడూ ఉంటుందని, తాము ఏం చేశామో ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో మంచి మెజార్టీతో గెలుస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని