Private Schools: ప్రైవేటు స్కూళ్లకు రాం రాం.. కొవిడ్‌ దెబ్బతో సర్కారు బడి కళకళ

 కొవిడ్‌ దెబ్బతో ప్రజల ఆదాయాలు పడిపోయి, జీవితాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా 39.72 లక్షల చిన్నారులు ప్రైవేటు

Updated : 10 Mar 2022 10:54 IST

 కొత్తగా చేరిన విద్యార్థులు దాదాపు 40 లక్షలు 
 ప్రైవేటు స్కూళ్లకు 30.5 లక్షలమంది టాటా
 కేంద్ర విద్యాశాఖ  నివేదిక - 2020-21 వెల్లడి

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ దెబ్బతో ప్రజల ఆదాయాలు పడిపోయి, జీవితాల్లో అనూహ్య మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా 39.72 లక్షల చిన్నారులు ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు వదిలి ప్రభుత్వ బడుల్లో చేరారు. కేంద్ర విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ (యూడీఐఎస్‌ఈ+) 2020-21 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దాదాపు 40 లక్షల మేర పెరగ్గా.. అదే సమయంలో ఎయిడెడ్‌ పాఠశాలల్లో 6,53,003.. ప్రైవేటు పాఠశాలల్లో 30,52,220.. ఇతర పాఠశాలల్లో 3,45,291 మేర విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రీ-ప్రైమరీ, ఒకటో తరగతి స్థాయిలో పాఠశాలల్లో చేరినవారి సంఖ్య లక్షల్లో తగ్గింది. మహమ్మారి కారణంగా పాఠశాల ప్రవేశాలను వాయిదా వేయడమే ఇందుకు కారణం కావచ్చు.

- ప్రత్యేక అవసరాలున్న పిల్లల సంఖ్య 2019-20లో 22.49 లక్షల మేర ఉండగా, 2020-21లో అది 21.69 లక్షలకు తగ్గింది. ఏడాదిలో 3.56% మేర తగ్గుదల నమోదైంది.

- దేశంలో పాఠశాలలకు విద్యుత్తుసౌకర్యం కొంతమేర పెరిగింది. 84% పాఠశాలలకు పనిచేసే విద్యుత్తు కనెక్షన్లు ఉన్నట్లు తేలింది. ఏడాదిలో 57,799 స్కూళ్లకు కొత్తగా విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు. తాగునీటి సౌకర్యం ఉన్న స్కూళ్లు కూడా 93.7% నుంచి 95.2 శాతానికి పెరిగాయి. బాలికలకు మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 93.91 శాతానికి పెరిగింది. ఏడాదిలో 11,933 స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించారు. చేతులు శుభ్రం చేసుకొనే సౌకర్యం కలిగిన స్కూళ్ల సంఖ్య కూడా 91.9%కి పెరిగింది.

- దేశంలో కంప్యూటరు సౌకర్యం ఉన్న స్కూళ్ల సంఖ్య మూడు శాతం వృద్ధితో ఆరు లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలోని 40% స్కూళ్లలో కంప్యూటర్లు ఉన్నాయి. ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉన్న స్కూళ్ల సంఖ్య 2.6% వృద్ధితో 3.7 లక్షలకు పెరిగింది. లైబ్రరీ / రీడింగ్‌రూం / రీడింగ్‌ కార్నర్‌లు ఉన్న స్కూళ్ల సంఖ్య 1.6% వృద్ధితో 85.6%కి చేరింది. 

- 2020-21 నాటికి ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమికోన్నత స్థాయి పాఠశాలల వరకు మొత్తం 25.38 కోట్ల పిల్లలు చేరారు. అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే ఇది 28.32 లక్షలు అధికం. పాఠశాలల్లోని అన్ని స్థాయుల్లో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో కూడా పెరిగింది.

- 2020-21 నాటికి 96.96 లక్షల టీచర్లు పాఠశాల విద్యాబోధనలో నిమగ్నమై ఉన్నారు. అంతకుమునుపు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8,800 మేర పెరిగింది. టీచరు - విద్యార్థుల నిష్పత్తి 2020-21లో ప్రాథమిక పాఠశాల స్థాయిలో 26, అప్పర్‌ప్రైమరీ స్థాయిలో 19, మాధ్యమిక స్థాయిలో 18, ఉన్నతవిద్య స్థాయిలో 26 మేర ఉంది.  

- 2020-21లో 12.2 కోట్ల బాలికలు ప్రాథమికస్థాయి నుంచి ఉన్నతవిద్య వరకు నమోదయ్యారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 11.8 లక్షలు ఎక్కువ. బోధనేతర సిబ్బంది సంఖ్యా పెరిగి, 15.8 లక్షలకు చేరింది. 

తెలంగాణ సర్కారు బడుల్లో పూర్వ ప్రాథమిక విద్యార్థుల సంఖ్య 1,702 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,702 మంది పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థులు ఉన్నారని జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్‌) నివేదిక వెల్లడించింది. యూడైస్‌ 2020-21 విద్యా సంవత్సరం నివేదికను కేంద్రం బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 2,33,449 మంది విద్యార్థులు పూర్వ ప్రాథమిక తరగతుల్లో చదువుతుండగా.. అందులో సర్కారు బడుల్లో ఉన్నవారు కేవలం 1,702 మందే కావడం గమనార్హం. ఒకటో తరగతిలో మొత్తం 4.79 లక్షల మంది చేరగా.. అందులో ప్రీ ప్రైమరీ చదివి ఒకటో తరగతిలో చేరిన వారు 1.54 లక్షల మంది ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని