సంజీవనే ప్రాణం తీసింది

ఆపదలో ప్రాణాలను నిలబెట్టాల్సిన 108 అంబులెన్స్‌ మొరాయించింది. ద్విచక్ర వాహనంపై మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురంలో

Updated : 01 Jul 2022 06:54 IST

 అత్యవసర సమయంలో మొరాయించిన 108

వైద్యం అందక పురుగు మందు తాగిన మహిళ మృతి

చర్ల, న్యూస్‌టుడే: ఆపదలో ప్రాణాలను నిలబెట్టాల్సిన 108 అంబులెన్స్‌ మొరాయించింది. ద్విచక్ర వాహనంపై మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... గ్రామానికి చెందిన గొత్తికోయ మహిళ మాడవి చుకిడీ(25) కుటుంబ సమస్యలతో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు చూసి ఉదయం 108కి సమాచారం ఇచ్చారు. చర్లకు చెందిన 108 అంబులెన్స్‌లో చుకిడీని ఆసుపత్రికి తీసుకువస్తుండగా... అటవీ మార్గంలో తాలిపేరు ప్రాజెక్టు శివారులో వాహనం కాస్తా మొరాయించింది. అంతా కలిసి తోసినా కదలలేదు. మరోవైపు వర్షం పడటంతో అప్పటికే అటవీ రహదారి బురదమయంగా మారింది. చేసేదేమీ లేక గ్రామస్థులు ద్విచక్ర వాహనం మీద చుకిడీని చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కొంతకాలంగా 108 వాహనం సరిగా పని చేయడం లేదని ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ప్రాణాపాయ స్థితిలో అపర సంజీవని వాహనం అక్కరకురాకుండా పోయిందని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని