పుజారా పాఠాలు అమూల్యం

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ముంగిట తన సహచరులకు భారత సీనియర్‌ చెతేశ్వర్‌ పుజారా చెప్పబోయే పాఠాలు అమూల్యమైనవని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 01 Jun 2023 01:55 IST

పోర్ట్స్‌మౌత్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ముంగిట తన సహచరులకు భారత సీనియర్‌ చెతేశ్వర్‌ పుజారా చెప్పబోయే పాఠాలు అమూల్యమైనవని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్లలో చాలామంది గత రెండు నెలలుగా ఐపీఎల్‌లో మునిగి ఉండగా.. పుజారా మాత్రం ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడికి కౌంటీల్లో చాలా అనుభవమే ఉంది. ఈ సీజన్లో ససెక్స్‌ క్లబ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన పుజారా.. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. ఈ నేపథ్యంలో సన్నీ మాట్లాడుతూ.. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే ఓవల్‌ మైదానంలో పుజారా ఈ మధ్య మ్యాచ్‌ ఆడి ఉండకపోవచ్చు. కానీ లండన్‌ నుంచి అతను ప్రాతినిధ్యం వహించే ససెక్స్‌ ఎంతో దూరం కాదు. కాబట్టి ఓవల్‌ పిచ్‌ ఎలా స్పందిస్తుందో తనకు అవగాహన ఉంటుంది. సహచర బ్యాటర్లతో పాటు కెప్టెన్‌కు అతను చెప్పబోయే పాఠాలు అమూల్యమైనవి. స్టీవ్‌ స్మిత్‌తోనూ కలిసి ఆడాడు అతడి కోసం వ్యూహాలు రూపొందించడానికి కూడా పుజారా ఉపయోగపడతాడు’’ అని చెప్పాడు. ఐపీఎల్‌ అయిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనున్న భారత బ్యాటర్లు కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ‘‘వాళ్లు బ్యాట్‌ వేగం మీద దృష్టిపెట్టాలి. టీ20ల్లో ఆడేటపుడు బ్యాట్‌ వేగం ఎక్కువ ఉంటుంది. టెస్టు మ్యాచ్‌లో వేగాన్ని నియంత్రించుకోవాలి. అందులోనూ స్వింగ్‌ ఎక్కువగా ఉండే ఇంగ్లాండ్‌లో సాధ్యమైనంత ఆలస్యంగా బంతిని ఆడే ప్రయత్నం చేయాలి. బంతిని త్వరగా అందుకునే ప్రయత్నం చేస్తే పొరపాటు అవుతుంది’’ అని గావస్కర్‌ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌కు ఎదురయ్యే సవాళ్ల గురించి సన్నీ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లాండ్‌ పరిస్థితులే అతి పెద్ద సవాల్‌. మామూలుగా మన దగ్గర మ్యాచ్‌ ఆడుతుంటే సూర్యుడు మన వెంటే ఉంటాడు. అక్కడ అసలు ఎండే ఉండదు. వాతావరణం ఎప్పుడూ మబ్బులు పట్టి.. చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడూ జెర్సీ మీద స్వెట్టర్‌ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. బంతి కూడా గాల్లో ఎక్కువ స్వింగ్‌ అవుతుంది. అందుకే ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి రెండు మూడు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది’’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని