Kapil Dev: 4 ఓవర్లకే అలసటా? నాకైతే ఆశ్చర్యమే!

ఈ తరం క్రికెటర్ల మానసిక వైఖరిలో మార్పును టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ ప్రశ్నించారు. ఐతే క్రికెట్‌ పరిణామంలో అది అంగీకార యోగ్యమేనని తెలిపారు. నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోవడం మాత్రం బాధాకరమని పేర్కొన్నారు. యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యను ఉద్దేశించి ఆయన ఈ...

Published : 02 Jul 2021 01:13 IST

ఈ తరం కుర్రాళ్ల వైఖరి మారిందన్న కపిల్‌ దేవ్‌

ముంబయి: ఈ తరం క్రికెటర్ల మానసిక వైఖరిలో మార్పును టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ ప్రశ్నించారు. ఐతే క్రికెట్‌ పరిణామంలో అది అంగీకార యోగ్యమేనని తెలిపారు. నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోవడం మాత్రం బాధాకరమని పేర్కొన్నారు. యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీమ్‌ఇండియా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కపిల్‌దేవ్‌ సమర్థంగా ఆ పాత్ర పోషించారు. హార్దిక్‌ పాండ్య దొరకడంతో మళ్లీ ఆ కొరత తీరిందని సంతోషించారు. గతేడాది వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాక అతడు బౌలింగ్‌ చేయడం లేదు. జట్టు యాజమాన్యం సైతం బంతి ఇచ్చిన రెండు మూడు సార్లు 4 ఓవర్లకు మించి బౌలింగ్‌ చేయనివ్వలేదు.

‘ఏడాదిలో పది నెలలు క్రికెట్‌ ఆడితే ఎక్కువ గాయపడతారు! కానీ, ఈనాటి క్రికెట్ సులభ స్థాయికి మారింది. బ్యాటు లేదా బంతితో సత్తా చాటితే చాలు. అదే మా తరంలో మేం ఇంకా ఎన్నో  చేయాల్సి వచ్చేది. ఈనాటి క్రికెట్‌ మారిపోయింది. కొన్నిసార్లు బౌలర్‌ నాలుగు ఓవర్లు వేయగానే అలసిపోవడం చూస్తే బాధేస్తోంది. వారికి మూడు, నాలుగు ఓవర్లకు మించి బంతి ఇవ్వడం లేదన్న సంగతి నా చెవిన పడింది’ అని కపిల్‌ అన్నారు.

‘మా తరంలో ఎలా ఉండేదో గుర్తొస్తోంది. అది తప్పో ఒప్పో నేను చెప్పడం లేదు. నెట్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చే ఆఖరి ఆటగాడికీ మేం పది ఓవర్లు విసిరేవాళ్లం. అలాంటి వైఖరి అభివృద్ధి చేసుకోవాలి. అలా సాధన చేస్తేనే కండరాలు బలపడతాయి. ఇప్పటి వాళ్లకు నాలుగు ఓవర్లు విసిరితే చాలనిపిస్తోంది. కానీ, మా తరం వాళ్లకి అది కాస్త వింతగా ఉంటుంది’ అని కపిల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని