Rishabh Pant: రోడ్డు ప్రమాదం.. క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Updated : 30 Dec 2022 16:13 IST

రూర్కీ: టీమ్‌ఇండియా క్రికెటర్‌ పంత్‌ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్‌ కారును పంతే (Pant) నడిపాడు. మంటలు చెలరేగగానే అతడు కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేశాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పంత్‌ తల, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం తర్వాత పంత్‌ను రూర్కీలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అతడిని దేహ్రాదూన్‌లో మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.  ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని..

పంత్‌ ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. పంత్‌ వస్తున్న విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలియదట. సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకొని.. తను వస్తున్నట్లు పంత్‌ ఎవరికీ చెప్పలేదని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే అతడి కుటుంభసభ్యులు ఆస్పత్రికి బయలు దేరారు.

త్వరగా కోలుకో ఛాంప్‌..

ఘటనపై మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘భగవంతుడి దయ వల్ల ప్రమాదం నుంచి అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. గెట్ వెల్‌ సూన్‌ ఛాంప్‌’ అని లక్ష్మణ్‌ ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌ కూడా స్పందిస్తూ.. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు అతడి అభిమానులు కూడా పంత్‌ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు. పంత్ ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని సచిన్‌ తెందూల్కర్, వసీమ్ అక్రమ్, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా పోస్టులు పెట్టారు.

ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌ ఆడిన విషయం తెలిసిందే. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ఇక క్రిస్మస్‌ వేడుకలను పంత్‌.. మాజీ కెప్టెన్‌ ధోనీతో కలిసి దుబాయ్‌లో చేసుకున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని