Umesh Yadav: అదే నా చివరి టోర్నీ.. ఛాన్స్‌ను మిస్‌ చేసుకోను: ఉమేశ్‌ యాదవ్

ఐపీఎల్‌ (IPL 2023)లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఫ్రాంచైజీకి ఆడుతున్న ఉమేశ్ యాదవ్‌ ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు సంపాదించాలని బలంగా భావిస్తున్నాడు. అలాగే భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంకప్‌లోనూ ఆడాలని ఉందని పేర్కొన్నాడు.

Published : 30 Mar 2023 00:30 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ ఉమేశ్ యాదవ్‌కు (Umesh Yadav) టెస్టు జట్టులో స్థానం దక్కుతుంది. కానీ, వన్డేలతోపాటు టీ20ల్లో చోటు సంపాదించడంలో మాత్రం ఉమేశ్‌ విఫలమవుతున్నాడు. దాదాపు పన్నెండేళ్ల కిందట జాతీయ జట్టులోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ ఇప్పటి వరకు 56 టెస్టులు, 75 వన్డేలు, కేవలం 9 అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌లో (IPL) మాత్రం 130కిపైగా మ్యాచ్‌లను ఆడాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు (KKR) ఆడుతున్న ఉమేశ్‌ యాదవ్‌ ఈసారి ఎలాగైనా అద్భుత ప్రదర్శన చేసి వన్డే ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇదే తనకు చివరి ప్రపంచకప్‌ అవుతుందని, తప్పకుండా జట్టులోకి వస్తానని ఉమేశ్‌ నమ్మకంగా చెప్పాడు. 

‘‘ప్రతి నాలుగేళ్లకొకసారి వన్డే ప్రపంచకప్ జరుగుతుంటుంది. ఈసారి జట్టులో భాగం కావాల్సిందే. ఇదే నాకు చివరి అవకాశం అవ్వొచ్చు. అందుకే, ఐపీఎల్‌లో ఉత్తమ ప్రదర్శన ఇస్తే తప్పకుండా వన్డే ఫార్మాట్‌లో జట్టులోకి అవకాశం వస్తుందని నమ్ముతున్నా. ఇంకో ఛాన్స్‌ కోసం మరో నాలుగేళ్లు వేచి చూడటం నా వల్ల కాకపోవచ్చు’’ అని ఉమేశ్ యాదవ్‌ తెలిపాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్‌ 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1వ తేదీన పంజాబ్‌ కింగ్స్‌తో కోల్‌కతా తొలి మ్యాచ్‌ ఆడనుంది. శ్రేయస్‌ అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్‌కు నితీశ్‌ రాణాను మేనేజ్‌మెంట్ కెప్టెన్‌గా నియమించింది. 

ఎక్కడైనా సవాళ్లు తప్పవు: కేకేఆర్‌ కోచ్

శ్రేయస్‌ అయ్యర్ త్వరగా కోలుకుని సీజన్‌ మధ్యలోనైనా జట్టుతో కలుస్తాడనే ఆశాభావంతో ఉన్నట్లు కేకేఆర్‌ ప్రధాన కోచ్ చంద్రకాంత్‌ పండిత్ తెలిపారు. నాయకుడిగా నితీశ్ రాణా అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. ‘‘క్రికెట్‌ కోచ్‌గానైనా, ఆటగాడిగానైనా ఎప్పుడూ వెనుకడుగు వేసింది లేదు. జట్టులో  కొందరు అందుబాటులో లేరని బాధపడలేదు. కీలకమైన శ్రేయస్‌ లేకపోవడం నష్టమే కానీ, అధిగమిస్తాం. శ్రేయస్ మధ్యలోనైనా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. అయితే, నితీశ్ రాణాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తప్పకుండా తానేంటో నిరూపించుకుంటాడు. దేశీయ క్రికెట్‌ కోచ్‌గా అక్కడి పరిస్థితులు వేరు. ఐపీఎల్‌లో అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి పనిచేయడం విభిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా సరే సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించాలి’’ అని పండిత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని