IND vs SA: టీమ్‌ఇండియాకు మూడో పేసర్‌గా సిరాజ్‌ సరైనోడు: నెహ్రా

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా మూడో పేసర్‌ను ఎంపిక చేయాల్సి వస్తే హైదరాబాద్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ముందుంటాడని మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు...

Updated : 24 Dec 2021 11:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా మూడో పేసర్‌ను ఎంపిక చేయాల్సి వస్తే.. హైదరాబాద్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ముందుంటాడని మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. బుమ్రా, షమి కచ్చితంగా తుదిజట్టులో ఉంటారని, దీంతో మూడో పేసర్‌ కోసం ఆలోచిస్తే.. సిరాజ్‌ అందుబాటులో ఉన్నాడన్నాడు. మరోవైపు సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైనా ఇటీవల న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మ్యాచ్‌లో అవకాశం దక్కిన సిరాజ్‌ ఆకట్టుకున్నాడని నెహ్రా అన్నాడు. అయితే, సఫారీ జట్టుతో ఆడేటప్పుడు అతడిని ఎంపిక చేయాలా? వద్దా? అనేది జట్టు యాజమాన్యం చేతుల్లో ఉంటుందన్నాడు.

‘టీమ్ఇండియాకు సానుకూలాంశం ఏంటంటే.. సరిపడా బౌలింగ్‌ దళం ఉంది. పేస్‌ విభాగం పటిష్ఠంగా తయారైంది. అలాగే ఉమేశ్‌ యాదవ్‌ లాంటి అనుభజ్ఞుడు ఉన్నాడు. జట్టుకు ఇలాంటి నాణ్యమైన ఆటగాళ్లను అందించినందుకు ఐపీఎల్‌కు ధన్యవాదాలు చెప్పాలి. ఆటగాళ్లంతా ఇప్పుడెంతో ఫిట్‌నెస్‌తో ఉన్నారు. బ్యాకప్‌ కూడా బలంగా ఉంది. ఇంతకుముందు జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లు మాత్రమే ఉండేవాళ్లు. ఒకవేళ ఎవరైనా గాయాలబారిన పడితే ఇక జట్టు డీలా పడిపోయేది. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదు. ముఖ్యంగా టెస్టుల్లో బలమైన బ్యాకప్‌ కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. ఇక కొత్త ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌పై స్పందించిన మాజీ పేసర్‌.. అతడిని నాలుగో ఆప్షన్‌గా చూడాలన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండే పరిస్థితుల ఆధారంగా బ్యాటింగ్‌లోనూ రాణించే శార్దూల్‌ను అవసరమైతే తుది జట్టులో ఎంపిక చేయాలని సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని