IND vs NZ : ఇంకా ఐదే మిగిలాయి.. లంచ్ లోపే ముగించేస్తారా?

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు...

Updated : 05 Dec 2021 18:26 IST

రెండో టెస్టులో విజయం దిశగా టీమ్‌ఇండియా

ముగిసిన మూడో రోజు ఆట

ఇంటర్నెట్ డెస్క్‌: ఫాలోఆన్‌ ఇవ్వకుండా వేగంగా పరుగులు సాధించింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. అప్పుడే సగం వికెట్లను కూల్చింది. ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉంది. విజయానికి కావాల్సినవి మాత్రం ఐదే వికెట్లు.. ఇదీ కివీస్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్‌లో గెలుపు వైపు దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా జట్టు పరిస్థితి. దక్షిణాఫ్రికా పర్యటనకు ఆత్మవిశ్వాసంతో వెళ్లేందుకు బాటలు పరుచుకుంది.

స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన మరుగున పడేలా.. బ్యాటింగ్‌ వైఫల్యంతో రెండో టెస్టులో ఓటమి దిశగా సాగుతోంది కివీస్‌. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పేకమేడలా కూలి భారత బౌలర్లకు దాసోహమన్న బ్యాటింగ్ లైనప్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కాస్త ప్రతిఘటించింది. ఓపెనర్లతో సహా సీనియర్‌ బ్యాటర్‌ విఫలమైనా సరే కొత్త ఆటగాళ్లు ఎదురొడ్డి మరీ జట్టు కుప్పకూలకుండా కాపాడారు. నాలుగో రోజుకు ఆటను తీసుకుపోగలిగారు.

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్‌లో హెన్రీ నికోల్స్‌ (36*), రచిన్‌ రవీంద్ర (2*) ఉన్నారు. కివీస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ టామ్‌ లేథమ్ (6), రాస్ టేలర్‌ (6), టామ్‌ బ్లండెల్‌ (0) మరోసారి విఫలమయ్యారు. విల్ యంగ్ (20) కాస్త ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. ఈ మూడు వికెట్లను అశ్విన్‌ (3/26) తన ఖాతాలో వేసుకున్నాడు. మరోసారి మొదటి ఇన్నింగ్స్‌ మాదిరిగానే కుప్పకూలుతుందని కంగారు పడిన కివీస్‌ను డారిల్ మిచెల్ (60)‌ ఆదుకున్నాడు. నికోల్స్‌తో కలిసి అర్ధశతకం (73) భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ చేసి ధాటిగా ఆడిన మిచెల్‌ను అక్షర్‌ పటేల్‌ (1/40) బోల్తా కొట్టించాడు. చివరి రెండు రోజుల్లో కివీస్‌ గెలవాలంటే 400 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదు వికెట్లు తీస్తే విజయంతోపాటు సిరీస్‌ టీమ్‌ఇండియా వశమవుతుంది.

మళ్లీ అజాజ్‌, రచిన్‌ దెబ్బ.. చివర్లో అక్షర్‌ ధాటిగా.. 

కివీస్‌కు ఫాలోఆన్‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన టీమ్ఇండియా 276/7 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ (62), పుజారా (47), శుభ్‌మన్ గిల్ (47), అక్షర్‌ పటేల్ (41*), విరాట్ కోహ్లీ (36) రాణించారు. శ్రేయస్‌ అయ్యర్ 14, వృద్ధిమాన్‌ సాహా 13, జయంత్‌ యాదవ్ 6 పరుగులు చేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత్‌ కోల్పోయిన పదిహేడు వికెట్లను కివీస్‌ స్పిన్నర్లే తీయడం విశేషం. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అజాజ్‌ పటేల్  (4/106), రచిన్‌ రవీంద్ర (3/56) ఉత్తమ ప్రదర్శన చేశారు. కివీస్‌ తరఫున ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అజాజ్‌ మరో రికార్డు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో (10/119) పడగొట్టిన విషయం తెలిసిందే.

స్కోర్లు ఇలా..

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345/10, రెండో ఇన్నింగ్స్: 276/7 (డిక్లేర్డ్‌)

న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్: 62/10

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని