ఎడతెగని నిరీక్షణ

రైళ్లు ఎక్కేందుకు లక్షల మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ శాఖ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. వెయిటింగ్‌ లిస్టుకు అనుగుణంగా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటుచేయకుండా ప్రయాణ సమయం వరకు ఊరిస్తూ ఆఖర్లో ఉసూరుమనిపిస్తోంది.

Updated : 14 Aug 2022 06:05 IST

పెద్దఎత్తున వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్ల జారీ

చివరి వరకు ఊరించి ఉసూరుమనిపిస్తున్న రైల్వేశాఖ

ఈనాడు - హైదరాబాద్‌

రైళ్లు ఎక్కేందుకు లక్షల మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ శాఖ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. వెయిటింగ్‌ లిస్టుకు అనుగుణంగా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటుచేయకుండా ప్రయాణ సమయం వరకు ఊరిస్తూ ఆఖర్లో ఉసూరుమనిపిస్తోంది. ఫలితంగా రద్దయిన టికెట్లతో రైల్లో ఎక్కలేక, అప్పటికప్పుడు ఇతర ప్రత్యామ్నాయాల్ని అందిపుచ్చుకోలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా వందల సంఖ్యలో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను జారీచేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్‌ ఖరారైన వారిలో ఎవరైనా రద్దు చేసుకుంటేనే వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం  ఐదారొందల మందికి నిరీక్షణ టికెట్లను జారీచేస్తుంటే 50, 60 మందికి మాత్రమే అవకాశం దక్కుతోంది. టికెట్ల రద్దుతో ఒక్కో ప్రయాణికుడు రూ.60 నష్టపోవాల్సి వస్తోంది. గతేడాది 8.1 లక్షల మంది ప్రయాణ టికెట్లు రద్దయ్యాయి. రూ.4.86 కోట్లు ప్రయాణికుల జేబుల్లోంచి రైల్వేకి వెళ్లాయి. మరోవైపు ఆర్‌ఏసీ పేరుతో ఒక్కో బెర్తును ఇద్దరికి కేటాయిస్తున్నారు. టికెట్‌కు పూర్తి ఛార్జీలు చెల్లించినా ఒకే బెర్తులో ఇద్దరు కూర్చుని ప్రయాణించాల్సి వస్తోంది. రిజర్వేషన్‌్ టిక్కెట్ల విషయంలో రైల్వే శాఖ అనుసరిస్తున్న విధానాలు ప్రయాణికులకు వ్యయప్రయాసలను మిగుల్చుతున్నాయి. రద్దీ మార్గాల్లో అదనపు లైన్లు నిర్మించాలి. సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపరచడం, టి-కాస్‌ వంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తే మరిన్ని రైళ్లు నడిపించొచ్చు. సాధారణంగా ప్రయాణికులు వారం, పది రోజుల ముందు ప్రయాణ ప్రణాళికలు వేసుకుంటారు. రైల్వేశాఖ మాత్రం రెండు, మూడు రోజుల ముందు కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. దీంతో ప్రజలు వాటిని అందిపుచ్చుకోలేని పరిస్థితి నెలకొంది.  రైల్వే బోర్డు మంజూరుచేసే కొత్త రైళ్లలో ద.మ.రైల్వేకి ప్రాధాన్యం లభించేలా అధికారులతో పాటు ఎంపీలు ఒత్తిడి చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

* సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు ఈనెల 14న వెళ్లే రైళ్లలో రిజర్వేషన్‌ పూర్తయిపోయింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో 418 మంది, గోదావరిలో 407 మంది, గరీబ్‌రథ్‌లో 306 మంది వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లతో ఉన్నారు.

* 15న తిరుపతి వెళ్లే శబరిలో 490, రాయలసీమలో 436, వెంకటాద్రిలో 423 మంది, బిహార్‌ వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 412 మంది రిజర్వేషన్‌ దొరక్క జాబితాలో నిరీక్షిస్తున్నారు.

* గతేడాది టికెట్‌ రద్దయిన ప్రయాణికుల్లో 48.14 శాతం సెకండ్‌ సిటింగ్‌, 41.97శాతం స్లీపర్‌ టికెట్లు తీసుకున్నవారే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని