PM Modi Europe Visit: సుస్థిరాభివృద్ధికి సహకరిద్దాం
పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో బుధవారం నిర్వహించిన ఇండియా-నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఇండియా-నార్డిక్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పిలుపు
నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్ నేతలతో విడివిడిగా భేటీ
కోపెన్హాగెన్: పరస్పర సహకారంతో కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రపంచ సుసంపన్నత్వానికి, సుస్థిరాభివృద్ధి సాధనకు తోడ్పాటునందించగలమని నార్డిక్ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో బుధవారం నిర్వహించిన ఇండియా-నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతలు, శుద్ధ ఇంధనం, పెట్టుబడులు, ఆర్కిటిక్లో పరిశోధనలు తదితర అంశాల్లో బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని సూచించారు. ఈ సదస్సులో డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధాన మంత్రులు పాల్గొన్నారు. కరోనా తదనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజం, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలపై సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్లో నెలకొన్న సంక్షోభంపై నేతలందరూ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ నార్డిక్ దేశాల ప్రధాన మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత సంప్రదింపులు జరిగాయి.
* ఐరోపా పర్యటనలో భాగంగా మూడో రోజైన బుధవారం ప్రధాని మోదీ కోపెన్హాగెన్లో నార్డిక్ దేశాల నేతలతో చర్చలు జరిపారు. తొలుత నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టారెతో భేటీ అయ్యారు. ‘‘సముద్ర వాతావరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, శుద్ధ ఇంధనం, అంతరిక్ష పరిశోధనలు, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ విధానం అమలులో నార్వే కీలక భాగస్వామిగా ఉంద’’ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
*స్వీడన్ ప్రధాని మగ్దలెనా ఆండర్సోన్తో భేటీలో... రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార సాంకేతికతలు, నవోన్వేషణలు తదితర రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
*ఐస్లాండ్ ప్రధాని కత్రిన్ జాకబ్స్దతిర్తో జియోథర్మల్ ఎనర్జీ, ఆర్థిక సహకారం, సముద్ర వాతావరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, మృత్స్యపరిశ్రమ, ఆహారశుద్ధి, విద్య, డిజిటల్ విశ్వవిద్యాలయాలపై మోదీ చర్చించారు. భారత్-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంస్థ(ఈఎఫ్టీఏ) సంప్రదింపులను వేగవంతం చేయడంపైనా నేతలిద్దరూ మాట్లాడుకున్నారు.
* ఫిన్లాండ్ ప్రధాని సనా మారున్తో జరిగిన సంప్రదింపుల్లో డిజిటల్ భాగస్వామ్యం, పెట్టుబడుల అనుసంధానత, వాణిజ్య భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. టెలికం మౌలిక సదుపాయాలు, డిజిటల్ రూపాంతరీకరణ తదితర రంగాల్లో భారత కంపెనీలతో జట్టు కట్టాల్సిందిగా ఫిన్లాండ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
భారతీయతకు అద్దంపట్టిన బహుమతులు
నార్డిక్ దేశాల నేతలతో భేటీ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ వారికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే పలు రకాల బహుమతులను అందజేశారు. వాటిలో గుజరాత్లోని కచ్లో కళాకారుల హస్త నైపుణ్యాన్ని చాటే వస్త్రంపై వేసిన పెయింటింగ్, బెనారస్లో తయారైన వెండి మీనాకారి పక్షి, రాజస్థాన్ కళాకారులు తయారు చేసిన ఇత్తడి వృక్షం తదితరాలు ఉన్నాయి.
మెక్రాన్తో మోదీ భేటీ
పారిస్: ఐరోపా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ బుధవారం ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్ అగ్రనేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వైపాక్షికమైన పలు అంశాలు సహా అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గురించి వారు చర్చించుకున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. జర్మనీ, డెన్మార్క్ పర్యటనలను ముగించుకున్న ప్రధాని మోదీ బుధవారం పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలీసీకి చేరుకున్న మోదీకి అధ్యక్షుడు మెక్రాన్ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఇటీవలే రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన మిత్రుడు మెక్రాన్కు మోదీ అభినందనలు తెలిపారు. ‘‘భారత్కున్న బలమైన అంతర్జాతీయ భాగస్వాముల్లో ఫ్రాన్స్ ఒకటి. విభిన్న రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి’’ అని పారిస్ చేరుకున్న వెంటనే మోదీ ట్వీట్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా నిలిపివేయాలి, ఈ సంఘర్షణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టాన్ని ఎలా నివారించాలి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లను ఉమ్మడిగా ఎలా ఎదుర్కోవాలి తదితర అంశాలపై మోదీ, మెక్రాన్ చర్చించుకున్నారు. మరోవైపున మెక్రాన్ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడినట్లు ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ఎలిసీ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాపై...ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించాల్సిన బాధ్యత ఉందని పుతిన్కు మెక్రాన్ స్పష్టం చేసినట్లు తెలిపింది. భారత్-ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగానూ మోదీ పర్యటనకు ప్రాధాన్యమేర్పడింది. ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించడం ఇది అయిదోసారి. 2019 ఆగస్టు, 2017 జూన్, 2015 నవంబరు, 2015 ఏప్రిల్ నెలల్లో మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. రెండు దేశాలు 1998 నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ