Bank Loan: లోన్‌ చెల్లింపు వివాదం.. భారతీయ బ్యాంకర్‌పై కాల్పులు!

ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న లోన్‌ తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదం కారణంగా భారతీయ బ్యాంకర్‌ (Indian Banker) ఒకరు ఉగాండా (Uganda)లో హత్యకు గురయ్యారు. 

Published : 16 May 2023 16:15 IST

కంపాలా: ఫైనాన్స్‌ సంస్థ నుంచి తీసుకున్న లోన్‌ (Bank Loan)ను తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదం కారణంగా భారతీయ బ్యాంకర్‌ (Indian Banker) ఒకరు ఉగాండాలో హత్యకు గురయ్యారు. స్థానిక వార్తా సంస్థ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తమ్‌ భండారీ అనే వ్యక్తి ఉగాండా (Uganda) రాజధాని కంపాలాలో టీఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థ చిన్న మొత్తాల్లో రుణాలు మంజూరు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇవాన్‌ వాబ్‌వైర్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్ టీఎఫ్‌ఎస్‌ సంస్థ నుంచి 2020లో 2.1 మిలియన్‌ షిల్లింగ్స్‌ (రూ. 41,000) రుణం తీసుకున్నాడు.

లోన్‌ తిరిగి చెల్లించే సమయంలో చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉండటంపై ఉత్తమ్‌ భండారినీ ఇవాన్‌ ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాదన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఇవాన్‌, తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో ఉత్తమ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఉత్తమ్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మొత్తం సంస్థలోని సీసీటీవీలో రికార్డ్‌ అయింది. కాల్పుల అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన ఇవాన్‌.. వెనక్కు వచ్చి కిందపడిపోయిన ఉత్తమ్‌పై మరోసారి కాల్పులు జరపడం సీసీటీవీలో రికార్డ్‌ అయింది. 

నిందితుడు ఇవాన్‌ వాబ్‌వైర్‌ కంపాలాలోని బుసియా పోలీస్‌ స్టేషన్‌లో రైఫిల్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. గతంలో విధుల్లో నిర్లక్ష్యంగా, మానసిక స్థితి సరిగాలేని కారణంగా అతన్ని ఐదేళ్లపాటు సస్పెండ్‌ చేసినట్లు కంపాలా మెట్రోపాలిటన్‌ పోలీస్‌ అధికారి పాట్రిక్‌ ఓన్‌యాంగో చెప్పారు. ఉత్తమ్‌ భండారీపై కాల్పులు జరిపిన ఏకే-47 తుపాకీని ఇయాన్‌, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో తోటి ఉద్యోగి నుంచి దొంగిలించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం కంపాలా డీఐజీ స్థానికంగా ఉన్న భారతీయుల్ని కలిసి వారి భద్రతపై భరోసా ఇచ్చినట్లు స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని