Jaahnavi Kandula: జాహ్నవి మృతి ఘటనపై సియాటెల్‌ మేయర్‌ క్షమాపణ

Jaahnavi Kandula: జాహ్నవి మృతి ఘటనపై అమెరికాలోని భారత సమాజానికి చెందిన దాదాపు 20 మంది ప్రతినిధులు శనివారం సియాటెల్‌ మేయర్‌, పోలీస్‌ ఉన్నతాధికారిని కలిశారు.

Published : 17 Sep 2023 12:13 IST

సియాటెల్‌: అమెరికాలో జరిగిన ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడినందుకు భారత సమాజాన్ని సియాటెల్‌ మేయర్‌ బ్రూస్‌ హారెల్‌ క్షమాపణలు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జాహ్నవి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి తెలిపారు.

అమెరికాలోని భారత సమాజానికి చెందిన దాదాపు 20 మంది ప్రతినిధులు శనివారం సియాటెల్‌ మేయర్‌, పోలీస్‌ ఉన్నతాధికారిని కలిశారు. పోలీసు అధికారి అమానవీయ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సియాటెల్‌ నగరాన్ని శాంతి, సామరస్యాలకు వేదికగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

జాహ్నవి మృతిపై నవ్వలేదు.. సియాటెల్‌ పోలీసు వివరణ

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అక్కడి పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యాన్ని భారత్‌ డిమాండ్‌ చేసింది. దీనిపై లోతైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అమెరికా హామీ ఇచ్చింది. అయితే, ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని తాజాగా సదరు పోలీసు అధికారి వివరణ ఇచ్చారు. న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని.. బాధితురాలిని అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని