UK visa: భారతీయుల యూకే వీసా దరఖాస్తులు వేగంగా ప్రాసెసింగ్‌

భారతీయుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని తొలగించేందుకు యూకే వేగంగా చర్యలు చేపట్టింది. బ్రిటన్‌ హోం మంత్రి బ్రేవర్మన్‌ వ్యాఖ్యలు వివాదం సృష్టించిన నేపథ్యంలో బ్రిటన్‌ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. 

Updated : 19 Oct 2022 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని తొలగించేందుకు యూకే వేగంగా చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని భారత్‌లోని బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లీస్‌ నిన్న రాత్రి ట్విటర్‌లో స్వయంగా వెల్లడించారు. వివిధ కారణాల వల్ల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో నెలకొన్న జాప్యాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తమ ప్రమాణాల ప్రకారం 15 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూరిచేస్తామని వెల్లడించారు. ‘‘వివిధ కారణాల వల్ల భారత్‌ నుంచి యూకే వీసా దరఖాస్తుల్లో పెరుగుదల కనిపించింది. కొవిడ్‌-19, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి కారణాలతో మా వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియ నిర్ధారిత 15 రోజులను దాటేసింది’’ అని ఎల్లీస్‌ వివరణ ఇచ్చారు. 

ప్రస్తుతం ఆ ప్రాసెసింగ్‌ ప్రక్రియ గాడిన పడిందని ఎల్లీస్‌ పేర్కొన్నారు. ‘‘మేము నిపుణుల వర్క్‌ వీసాల ప్రక్రియను వేగంగా ముగిస్తున్నాం. ఇక విజిటర్‌ వీసాల ప్రక్రియను కూడా 15 రోజుల వ్యవధిలోనే పూర్తిచేయడంపై దృష్టిపెట్టాం. దిల్లీ, యూకే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా బృందాలతో కలిసి సమష్టిగా కృషి చేస్తున్నాం. మేము తిరిగి గాడినపడ్డామని చెప్పేందుకు సంతోషిస్తున్నాను’’ అని ఎల్లీస్‌ పేర్కొన్నారు. వీసాల కోసం కనీసం మూడు నెలల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

వీసా పరిమితి దాటిన తర్వాతా బ్రిటన్‌లో నివసించే వారిలో అత్యధికులు భారతీయులే అని ఆ దేశ హోంమంత్రి, భారతీయ మూలాలున్న సుయెల్లా బ్రేవర్మన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్టనర్‌షిప్‌(ఎంఎంపీ) ఆశించిన రీతిలో పనిచేయడం లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో వీసాల అంశంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ఎంఎంపీ ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని లండన్‌లోని ఇండియన్‌ హైకమిషన్‌ బదులిచ్చింది. బ్రేవర్మన్‌ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సంక్షోభంలో పడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎల్లీస్‌ ప్రకటన వెలువడటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని