
గ్రేటర్ హైదరాబాద్
ఎస్సారెస్పీ, కడెం, దిగువ మానేరులలో ‘స్కడా’ అమలు
ఈనాడు, హైదరాబాద్: గేట్ల నిర్వహణ.. కాల్వకు నీటి సరఫరా తదితర సేవల్ని సాంకేతికత ఆధారంగా నిరంతరం పర్యవేక్షించే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్ (స్కడా) విధానాన్ని రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టుల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీరామసాగర్, కడెం, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. సంబంధిత విధానాలపై నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, రాష్ట్రంలో కేంద్ర జల సంఘం సీఈ రంగారెడ్డి, జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు ఇంజినీర్లు సోమవారం సమీక్షించారు. ఈ విధానం ఏర్పాటుకు నిర్వహించిన టెండర్లలో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రాజెక్టు గేట్లు, కాల్వలపై సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. జలాశయాల్లో నీటి మట్టం లెక్కించడం, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలను అంచనా వేసి గేట్లు ఎత్తడం, మూసివేయడం, తూముల ద్వారా కాల్వలకు నీటిని విడుదల చేయడం, ఎంత మేరకు నీరు విడుదల అవుతుందనే సమాచారాన్ని నిల్వ చేయడం తదితర కీలకమైన విధులను ‘స్కడా’ సాంకేతికత ద్వారా చేపడతారు.