
తాజా వార్తలు
కత్తితో దాడి..చికిత్సకు రూ.వెయ్యి,.ఆపై అరెస్టు
గుంటూరు: అకారణంగా యువకుడిపై కత్తితో దాడిచేసి అనంతరం చికిత్స కోసం రూ.1000 చేతిలో పెట్టిన ముగ్గురిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెంకు చెందిన పల్లం ఏసుదాసు కుమారుడు 18 సంవత్సరాల తేజ అమరావతిలోని వాళ్ల చిన్నమ్మ ఇంట్లో ఉంటూ ఆర్వీవీఎన్ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చర్చి ప్రతిష్ఠాపన ఉండగా వారి తల్లిదండ్రులు శనివారం ఉదయం అమరావతికి వచ్చారు. కార్యక్రమం పూర్తి కాగానే తల్లిదండ్రులను అక్కడి నుంచి కారులో తేజ స్వగ్రామంలో దింపి తిరిగి అమరావతికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్థానిక గోరంట్ల ఇన్నర్రింగ్ రోడ్డు చైతన్య టెక్నో కళాశాల వద్దకు రాగానే కారు టైరు పంక్చరైంది. దిగి దానిని పరిశీలిస్తుండగా ముందు ఒక యువకుడు వచ్చి మమ్మల్ని కారుతో గుద్ది ఆపకుండా వెళ్తావురా.. అంటూ దుర్భాషలాడుతూ చేత్తో కొట్టాడు. తేరుకునే లోపు వెంటనే కత్తితో పొడిచాడు.
పది నిమిషాల తర్వాత మరో ఇద్దరు యువకులు వచ్చి కర్రలతో కొట్టి వెళ్లారు. కొంత సేపు ఆగిన తర్వాత వారు ముగ్గురు తేజ దగ్గరకు వచ్చి ‘సారీ.. బ్రదర్ నిన్ను కాదు.. వేరే వాడిని కొట్టాల్సింది. పొరపాటున నిన్ను కొట్టాం.. ఇదిగో ఈ వెయ్యి రూపాయలు ఉంచుకొని చికిత్స చేయించుకో’.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గాయపడ్డ తేజ నల్లపాడు పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సంగడిగుంటకు చెందిన ముగ్గురు యువకులు తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వారు బైక్పై వెళ్తుండగా పక్క నుంచి దూసుకెళ్లిన కారును చేజ్ చేసే క్రమంలో పొరపాటున వేరే కారు యువకుడిపై దాడి చేసి కత్తితో పొడిచినట్టు పోలీసుల ఎదుట నిందితులు నేరం అంగీకరించారు.
ఇవీ చదవండి..
వెండిసింహాల చోరీ.. పాత నేరస్థుడి పనే