
తాజా వార్తలు
క్వారంటైన్లో 361 మంది ప్రయాణికులు..
ముంబయి: బ్రిటన్లో కొత్తరకం కరోనా వైరస్ బయటపడిన నేపథ్యంలో విదేశాల నుంచి భారత్కు వచ్చిన వారిని క్వారంటైన్లో పెడుతున్నారు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 664 మంది ప్రయాణికులు రాగా, వీరిలో 361 మందిని నిర్బంధంలో ఉంచినట్లు పౌర విమానయాన అధికారి చెప్పారు. ‘మంగళవారం మొత్తంగా 9 అంతర్జాతీయ విమానాలు సిటీలో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో వచ్చిన వారిని పరిశీలించిన అనంతరం 254 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతినిచ్చాం. గర్భిణిలు, వృద్ధులకు క్వారంటైన్ విధించలేదు’ అని అధికారి తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశ పౌర విమానయాన శాఖ కొన్ని ప్రామాణికాలను సవరించింది. ఈ క్రమంలో యూకే , మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొత్త ప్రొటోకాల్ను తీసుకొచ్చింది. ఈ నియమాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఏడురోజులు సాధారణ క్వారంటైన్, మరో ఏడు రోజులు గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంది.