
తాజా వార్తలు
రూ.6 లక్షల కోట్లు దాటిపోతుంది
అన్ని రకాల రుణాల వడ్డీ రద్దుపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
మరిన్ని ఉపశమన చర్యలను ఆర్థిక రంగం భరించలేదని స్పష్టీకరణ
దిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఆర్బీఐ ప్రకటించిన ఆరు నెలల మారటోరియం కాలానికి అన్నివర్గాల రుణగ్రహీతల అన్ని రకాల రుణాలపై వడ్డీని రద్దు చేసినట్లైతే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లు దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఒకవేళ బ్యాంకులు ఈ మొత్తాన్ని భరించినట్లైతే అవన్నీ తప్పనిసరిగా తమ నికర విలువలో ఎక్కువ భాగాన్ని తుడిచిపెట్టేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా ఆర్థిక సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఆశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఆర్.ఎస్.రెడ్డిల సుప్రీంకోర్టు ధర్మాసనానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదించారు. వడ్డీ మాఫీ అంశం గురించి ఆలోచించకపోవడానికి, వాయిదా మొత్తాల చెల్లింపును మాత్రమే వాయిదా వేయడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రంగాల వారీగా ఉపశమన చర్యలు చేపట్టాలంటూ స్థిరాస్తి, విద్యుత్తు రంగాల సంస్థలు సహా వివిధ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమర్పించిన అంశాల వివరాలను మెహతా చదివి వినిపించారు. మారటోరియం కాలానికి సంబంధించి అన్ని రకాల రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే ఆ మొత్తం రూ.6 లక్షల కోట్లు దాటిపోతుందని చెప్పారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కనుక వడ్డీని రద్దు చేస్తే.. ఆ బ్యాంకు 65 సంవత్సరాలుగా కూడబెట్టుకున్న విలువలోని సగ భాగం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. ‘‘డిపాజిట్ చేసినవారికి వడ్డీ చెల్లింపులు కొనసాగించడం అత్యవసర బ్యాంకింగ్ కార్యకలాపం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా నెరవేర్చాల్సిన అంశం. ఎందుకంటే చాలామంది చిన్న డిపాజిట్దారులు, పింఛనర్లు. వీరంతా తమ డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఆధారపడి జీవిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన మారటోరియం కాలానికి సంబంధించి ఎస్బీఐ రుణగ్రహీతల నుంచి వసూలు చేయాల్సిన వడ్డీ సుమారు రూ.88,078 కోట్లుగా ఉండగా, డిపాజిటర్లకు చెల్లించాల్సిన వడ్డీ సుమారు రూ.75,157 కోట్లుగా ఉందని భారతీయ బ్యాంకుల సంఘం సెప్టెంబర్ 25న దాఖలుచేసిన ప్రమాణపత్రాన్ని ఈ సందర్భంగా మెహతా ప్రస్తావించారు. కొవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కేంద్రం అనేక ఉపశమన చర్యలు చేపట్టిన సంగతిని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇక మరిన్ని ఉపశమన చర్యలు అంటే.. దేశ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయవచ్చని, దేశ ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలు ఆ పరిస్థితిని తట్టుకోలేవని స్పష్టంచేశారు.
ఇదీ చదవండి..
తేనె కల్తీ చైనా కంపెనీకి ఎరుకే