నేవీలో బీటెక్‌, ఉద్యోగం

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ పూర్తిచేసుకుని, భారతీయ నౌకాదళం (నేవీ)లో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. జేఈఈ మెయిన్స్‌ ర్యాంక్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి

Updated : 28 Jun 2023 00:52 IST

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ పూర్తిచేసుకుని, భారతీయ నౌకాదళం (నేవీ)లో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. జేఈఈ మెయిన్స్‌ ర్యాంక్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఇలా అవకాశం వచ్చినవారికి పుస్తకాలు, యూనిఫారం, వసతి, భోజనం అన్నీ ఉచితంగానే అందుతాయి. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ పట్టా అందిస్తుంది. నేవీ 10+2 టెక్నికల్‌ క్యాడెట్‌ ఎంట్రీ పూర్తి వివరాలు..

జేఈఈ-2023 మెయిన్‌ ర్యాంకుతో దరఖాస్తులను వడపోస్తారు. ఇందులో అవకాశం వచ్చినవారికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్‌, కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఏదో ఒక చోట అక్టోబరు/నవంబరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇవి రెండు దశల్లో 5 రోజులు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజులు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, మౌఖిక పరీక్ష ఉంటాయి. వీటిలో విజయవంతమైనవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ మెరిసినవారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు. 

శిక్షణ జనవరిలో

వీరికి శిక్షణ తరగతులు జనవరి 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫారం అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని అందిస్తుంది. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి తీసుకుంటారు. చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ కేటాయిస్తారు.
లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.56,100 అందుతుంది. మిలిటరీ సర్వీస్‌ పే రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలిపి గరిష్ఠంగా రూ.లక్ష వరకు జీతం అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు..మొదలైనవి పొందవచ్చు. 60 వార్షిక, 20 సాధారణ సెలవులు లభిస్తాయి.
ఖాళీలు: 30. (వీటిలో గరిష్ఠంగా 9 మహిళలకు).
విద్యార్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌-2023లో అర్హత సాధించడం తప్పనిసరి. అవివాహితులే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
వయసు: జులై 2, 2004 - జనవరి 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: జూన్‌ 30 వరకు.
వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు