గ్యాస్‌ ఆదాకు కిటుకు కనిపెట్టారు!

‘రోజు రోజుకు గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయి.. చాలా పొదుపుగా వాడుకోవాలి..’ ఏదో ఒక సందర్భంలో మన ఇంట్లో అమ్మానాన్నలు అనుకునే ఉంటారు. అనుకుంటూనే ఉంటారు. మనం విని వదిలేస్తాం.

Published : 23 Sep 2021 00:24 IST

‘రోజు రోజుకు గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయి.. చాలా పొదుపుగా వాడుకోవాలి..’ ఏదో ఒక సందర్భంలో మన ఇంట్లో అమ్మానాన్నలు అనుకునే ఉంటారు. అనుకుంటూనే ఉంటారు. మనం విని వదిలేస్తాం. కానీ ఓ ఇద్దరు అక్కయ్యలు మాత్రం గ్యాస్‌ ఆదా కోసం ఏకంగా ఓ పరికరాన్నే తయారు చేశారు.

నూష, రక్షిత నాయక్‌. వీళ్లది కర్ణాటక ఉడుపి జిల్లాలోని ఆర్డి గ్రామం. ప్రస్తుతం ఇద్దరూ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి తయారు చేసిన గ్యాస్‌ సేవింగ్‌ కిట్‌ ‘ఇన్నోవేషన్‌ అవార్డ్‌ ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్‌-2021’లో స్థానం దక్కించుకుంది.

అమ్మ చెప్పిందని..

అనూష వాళ్ల అమ్మ పదే పదే అనేది ‘అయ్యో.. గ్యాస్‌ ధర మండిపోతోంది. వృథా కాకుండా సమర్థంగా వాడుకునే ఉపాయం ఉంటే బాగుండు’ అని. ఇది అనూషలో ఆలోచన రేకెత్తించింది. ఈ విషయాన్ని రక్షితనాయక్‌తో పంచుకుంది. ఇద్దరూ కలిసి ఓ మెటల్‌ఫ్రేమ్‌ను తయారు చేశారు. దానికి కాపర్‌ కాయిల్‌ ఉంటుంది. దీనికి ఒక వైపు కుళాయికి అమర్చుకోవడానికి ఏర్పాటు ఉంటుంది. మరో వైపు నుంచి నీళ్లు పట్టుకోవాలి.

వంట అవుతుండగానే వేడినీరు..

ఈ గ్యాస్‌సేవింగ్‌ కిట్‌ను స్టవ్‌కు అమర్చిన తర్వాత బర్నర్‌నుంచి వేడిని ఈ కాయిల్‌ గ్రహిస్తుంది. దాంతో కాయిల్‌లో ఉన్న నీరు వేడెక్కుతుంది. ఆ నీటినే పాత్రలో పట్టుకుంటే సరి. ఎంచక్కా వాటితో స్నానం చేసేయొచ్చు. అంటే ప్రత్యేకంగా వేడినీళ్ల కోసం పొయ్యిని మండించాల్సిన అవసరం లేదు. వంట అవుతుండగానే అదే సమయంలో వేడినీరూ సిద్ధమైపోతుందన్నమాట. ఇలా 10 నిమిషాల్లో దాదాపు 13 లీటర్ల వేడినీటిని పొందవచ్చు. అంటే ఓ వైపు గ్యాస్‌, డబ్బు.. మరో వైపు సమయమూ ఆదా అవుతుంది. అంతేకాదు గీజర్‌ వాడాల్సిన అవసరమూ రాదు కాబట్టి కరెంట్‌బిల్లూ తగ్గుతుంది.

ప్రధాని చేతుల మీదుగా..

‘ఇన్నోవేషన్‌ అవార్డ్‌ ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్‌-2021’లో మొత్తం 14 ప్రాజెక్టులకు అవార్డులు లభిస్తే.. అందులో ఈ ఇద్దరూ తయారు చేసిన గ్యాస్‌సేవింగ్‌ కిట్‌ నాలుగో స్థానంలో నిలిచింది. త్వరలో వీళ్లు ప్రధాని మోదీ చేతుల మీదుగా దిల్లీలో పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మొత్తానికి అనూష, రక్షిత నాయక్‌ ఇద్దరూ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు