సునామీ.. అమ్మవారి ఆలయాన్ని తాకలేదు

2004లో ఇండోనేషియా తీరంలో ఏర్పడిన సునామీ అనేకదేశాల తీరాలను ధ్వంసం చేసింది. భారత తూర్పు, పశ్చిమ తీరప్రాంతాల్లోని పలు ప్రదేశాల్లో విలయం సృష్టించింది. దీని ధాటికి కేరళ దక్షిణ తీరం తీవ్ర నష్టానికి గురైంది.

Updated : 14 Mar 2023 18:39 IST

కట్టిల్‌ మెక్కతిల్‌ భాగవతి అమ్మవారు

2004లో ఇండోనేషియా తీరంలో ఏర్పడిన సునామీ అనేకదేశాల తీరాలను ధ్వంసం చేసింది. భారత తూర్పు, పశ్చిమ తీరప్రాంతాల్లోని పలు ప్రదేశాల్లో విలయం సృష్టించింది. దీని ధాటికి కేరళ దక్షిణ తీరం తీవ్ర నష్టానికి గురైంది. అయితే కొల్లాం జిల్లాలో అరేబియా సముద్రానికి, జలమార్గానికి మధ్య ఉన్న చిన్న దీవిలోని అమ్మవారి ఆలయాన్ని మాత్రం సునామీ తాకకపోవడం విశేషం. అమ్మవారి మహిమ కారణంగానే సునామీ అలలు ఇక్కడకు రాలేదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేరళలోని కొల్లాం జిల్లా శంకర మంగళం సమీపంలో ఉందీ కట్టిల్‌ మెక్కతిల్‌ భాగవతి అమ్మవారి ఆలయం. దీనికి అనేక శతబ్దాల చరిత్ర ఉంది.

మొసలిపై అమ్మవారు స్వయంగా విచ్చేశారు..

స్థలపురాణం ప్రకారం అమ్మవారు ఇక్కడకు చంపక్కులం నుంచి మొసలిపై వచ్చి స్వయంభువుగా వెలిశారు. అమ్మవారు స్వయంగా దీపం (కెడవిలక్కు- అంటే ఎప్పటికీ కొండెక్కదని అర్థం) వెలిగించారని చెబుతుంటారు. ఇప్పటికీ ఆ దీపం వెలుగుతోంది. ఏటా జరిగే ఉత్సవాలకు చంపక్కులం నుంచి ధ్వజం రావడం సంప్రదాయంగా మారింది. కేరళ పాలకుల్లో అగ్రవీరుల్లో ఒకరైన రాజా మార్తాండవర్మ ఇక్కడకు వచ్చి అమ్మవారిని ఆరాధించారు. అక్కడే ఒక భవంతిని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

మొక్కు తీరితే గంటలిస్తారు..

అమ్మవారికి మొక్కుకున్న భక్తులు తమ కోరికలు తీరిన అనంతరం ఇత్తడి గంటలను ఇవ్వడం విశేషం. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కొమ్మలకు ఈ గంటలు కడతారు. ప్రతి నెలకు దాదాపు 4 లక్షల గంటలు కడతారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మర్రిచెట్టులోని దాదాపు సగం కొమ్మలకు ఈ గంటలు ఉండటం గమనార్హం. కొందరు ఒక గంట కడితే మరికొందరు వెయ్యి గంటల వరకు కడుతుంటారు. గర్భగుడిలో అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి గంటలు కట్టి తమ మొక్కు తీర్చుకుంటారు. ఓ సారి ఆలయ ధ్వజస్తంభం నుంచి ఓ గంట కిందకు పడిపోయింది. అర్చుకుల్లో ఒకరు దాన్ని తీసుకొని మర్రిచెట్టు కొమ్మకు కట్టారు. అనంతరం ఆయన జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయట. దీంతో గంటలు కట్టే సంప్రదాయం అప్పటి నుంచి ప్రారంభమైంది.

ఇలా చేరుకోవాలి..

* రైల్లో కొల్లాం చేరుకుని అక్కడ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు.
* విమానంలోనైతే కొల్లాం సమీపంలో ఉన్న తిరువనంతపురంలో దిగాల్సి ఉంటుంది.
* తిరువనంతపురం-షొర్నూర్‌ జలమార్గం ఈ దీవి మీదుగా పోతుంది. జలమార్గంలో ప్రయాణించడం కొత్త అనుభూతి కలిగిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని