Lord Shiva: శివయ్యా.. మెడలో పుర్రెల దండ ఎందుకయ్యా?

శివుడు కొన్నికొన్ని సందర్భాలలో పుర్రెలు, ఎముకలు ధరించి కనిపిస్తుంటాడు. మంగళానికే మంగళకరుడైన దేవుడు ఎందుకలా ఉండాల్సి వచ్చింది అనే విషయం ఈ కథా సందర్భంలో కనిపిస్తుంది.

Published : 14 Mar 2024 09:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివుడు కొన్నికొన్ని సందర్భాలలో పుర్రెలు, ఎముకలు ధరించి కనిపిస్తుంటాడు. అలాగే స్వామి శ్మశానాలలో తిరుగుతుంటాడని, చితాభస్మాన్ని ధరిస్తుంటాడని చాలా పురాణాల్లో కనిపిస్తుంటుంది. ఇదంతా మంగళ విరుద్ధమైనది కదా అనే భావన చాలా మందిలో కలుగుతుంటుంది. నిజమే.. కానీ మంగళానికే మంగళకరుడైన దేవుడు ఎందుకలా ఉండాల్సి వచ్చింది అనే విషయం ఈ కథా సందర్భంలో కనిపిస్తుంది. అలాగే అమంగళం, అపవిత్రత సోకుతున్నాయన్నప్పుడు వాటినుంచి బయటపడి పవిత్రతను పొందటానికి ఓ చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రం గురించి ఇక్కడే ప్రస్తావితమై ఉంది. సమాజంలో కొంతమంది దుర్మార్గులు దైవాన్ని ఆరాధిస్తూ తమకు మేలు చేయమంటూ పూజలు చేస్తుంటారు. మరి వారు దుర్మార్గులైతే ఆ దేవతలు వారి కోర్కెలను ఎలా తీరుస్తున్నారు? అని ఓ సందేహం కలుగుతుంది. నిజమే వారు దుర్మార్గులే. వారు చేసిన పూజ నిష్కల్మషమైనదే. అందుకే వారిని దైవం అనుగ్రహిస్తూ ఉంటాడు. వారి దుర్మార్గాన్ని మాత్రం దేవుడు ఓ కంట కనిపెడుతూ దురాగతాలను చేసినందుకు తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించేలా చేసి తీరుతాడు. ఇలాంటి విషయం గురించి పద్మపురాణం ఉత్తరఖండం నలభై ఒకటో అధ్యాయంలో ఓ కథ ఉంది.

పాషండ మతం వెనుక..

ఈ కథలో శ్రీమహావిష్ణువే ఈశ్వరుడిని ప్రేరేపించి నాస్తిక మతాన్ని అంటే దైవదూషణం, వేదనింద, విచ్చలవిడితనం లాంటి వాటిని ప్రచారం చేయించినట్లు ఉంది. దీన్నే పాషండ మతం అని కూడా అంటారు. కథాసారానికి వస్తే.. పార్వతీదేవి పరమేశ్వరుడిని ఓసారి ఇలా ప్రశ్నించింది. 'స్వామీ! శ్మశానంలో తిరగటం, ఎముకలు, పుర్రెలు మాలలుగా ధరించి బూడిద రాసుకొని ఉండటం ఇవన్నీ అశుచికి లక్షణాలు. అలాంటి వాటిని ఎందుకు ధరిస్తున్నట్టు అని ప్రశ్నించింది. అప్పుడు పరమేశ్వరుడు భస్మ, అస్తిధారణ చేస్తూ అశుచిగా ఉండటం వెనక జరిగిన ఓ సంఘటనను వివరించాడు. పూర్వం దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతుండేది. దేవతలను రాక్షసులు ఎప్పుడూ బాధిస్తూనే ఉండేవారు. దానికి కారణం బ్రహ్మాది దేవతలను రాక్షసులు ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలను పొందటమే. ఆ రాక్షసుల తపస్సుకు దేవతలు వరాలను ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ వర ప్రభావంతో దానవులు విర్రవీగుతూ దేవతలను విపరీతంగా బాధిస్తుండేవారు.

ఈ బాధను తట్టుకోలేక ఒకసారి ఇంద్రాదులంతా వైకుంఠానికి చేరి శ్రీమహావిష్ణువును శరణువేడారు. విష్ణువు క్షణకాలం ఆలోచించి పరమేశ్వరుడిని పిలిచాడు. రాక్షసులంతా తపస్సు చేసి వరాలను పొందుతున్నది ధర్మమార్గంలో నడుచుకునే దేవతలను బాధించటానికే. అలాంటి వారికి మంచి జరగకుండా వారంతా నరకానికే వెళ్లే ఓ ఉపాయం ఉందని దాన్ని ఆలకించమని చెప్పాడు. రాక్షసులు చేస్తున్నది ఓ రకంగా మోసమే. కాబట్టి వారిని ఏదో విధంగా మోహపరిచి మోసంతోనే వారి బాధ నుంచి దేవతలకు విముక్తి కలిగించాలని చెప్పాడు. కాబట్టి వెంటనే అపవిత్రాలైన పుర్రెలు, ఎముకలు లాంటి వాటిని మెడలో ధరించి బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరకు వెళ్లి ఆ వేషంతో వారిని ఆకర్షించమని చెప్పాడు. వేదనింద, దైవనింద, సత్కార్య విముఖత లాంటి వాటిని వారిలో కలిగించమని.. అలా చేస్తే ఆ రాక్షసులు పాపాసక్తులై ప్రవర్తించి నాశనమవుతారని శ్రీమహావిష్ణువు శివుడికి ఉపాయం చెప్పాడు.

రామ మంత్ర ప్రభావం..

శివుడికి ఓ సందేహం కలిగింది. తాను అపవిత్ర వస్తువులను ధరించటం, అపవిత్ర కార్యాలను చేయటంవల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటని అనుకున్నాడు. ఆ సందేహాన్ని శ్రీమహావిష్ణువు ముందు ఉంచాడు. అప్పుడు విష్ణువు ఓ సలహా ఇచ్చాడు. శ్రీరామాయనమః అనే షడక్షర మంత్రం (ఆరు అక్షరాల మంత్రం) ఒకటుందని సీతావల్లభుడైన శ్రీరామచంద్రుడిని స్మరించి ఆ మంత్రాన్ని జపిస్తే సన్మార్గులెవారికైనా ఎలాంటి పాపమూ అంటబోదని చెప్పాడు. ఆ మాటలు విన్న శివుడు వెంటనే విష్ణువు చెప్పినట్టుగా వేషధారణ చేసుకొని రాక్షసుల దగ్గరకు వెళ్లి విచిత్ర వేషంతో వారందరినీ ఆకట్టుకున్నాడు. పాషండ మతవిధానాన్ని ఉపదేశించాడు. దాంతో దైవనింద, వేదనింద లాంటివన్నీ రాక్షసులకు అలవాటయ్యాయి.

గతంలో ఎప్పుడైనా దేవతల మీదకు రాక్షసులు యుద్ధానికి వెళ్లి గెలిచినా మళ్లీ ఏ బ్రహ్మదేవుడి గురించో తపస్సు చేస్తే పాపాలన్నీ హరించి పోతుండేవి. పాషండ మతాన్ని (నాస్తిక) అవలంబించిన దగ్గర నుంచి రాక్షసులకు ఏ విధమైన దైవ సహకారమూ లభించటం లేదు. దాంతో  తేజస్సంతా క్షీణించి నశించసాగారు. ఈ విషయాన్నంతా శివుడు పార్వతికి వివరించి శ్రీమహావిష్ణువు ఆజ్ఞానుసారం శిష్టరక్షణ కోసమే తానలా భస్మ, అస్తిధారణ చేస్తూ బూడిద పూసుకొని శ్మశానంలో తిరుగుతూ ఉంటున్నట్టు చెప్పాడు. త్రిపురాసుర, వృత్రాసుర లాంటి రాక్షసుల విషయంలో కూడా ఆ రాక్షసులు ధర్మంగా తపస్సు చేసిన పరిస్థితికి మెచ్చి దైవం వారికి వరాలిచ్చినట్టు కనిపిస్తుంది. ఆ రాక్షసుల ఆగడాలు మరీ మితిమీరినప్పుడు మాత్రం ధర్మరక్షణ కోసం దైవం చిత్రవిచిత్ర రీతుల్లో వధించినట్లు కనిపిస్తుంది. ఈ కథా సందర్భం పూజలు, ఆరాధనలు, తపస్సులు వంటివి చేసి దైవాన్ని మెప్పించేవారు, వరాలు పొందేవారు, ఆ వరాలను ధర్మ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని, అలా కానిపక్షంలో శిక్షపడి తీరుతుందనే ఓ హెచ్చరిక అంతర్లీనంగా ఉంది. ఈ కథలోనే ఆరక్షరాల శ్రీరామాయనమః మంత్ర ప్రభావం, శైవ, వైష్ణవ సామరస్యం లాంటివి చెప్పారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని