తనోట్‌ మాత ఆలయం (జైసల్మేర్‌)

జగజ్జనని ఆది పరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు అభయమిస్తోంది. అమ్మ ఆరాధనకు వేలాది దేవాలయాలున్నాయి. వీటిల్లో ప్రముఖమైనది రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో పాక్‌ సరిహద్దుకు ఆనుకొని ఉన్న...

Updated : 10 Nov 2023 08:54 IST

జగజ్జనని ఆది పరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు అభయమిస్తోంది. అమ్మ ఆరాధనకు వేలాది దేవాలయాలున్నాయి. వీటిల్లో ప్రముఖమైనది రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో పాక్‌ సరిహద్దుకు ఆనుకొని ఉన్న శ్రీ తనోట్‌ మాత ఆలయం. అష్టాదశ శక్తి పీఠాల్లో పాక్‌లోని బలూచిస్థాన్‌లో వెలిసిన హింగ్లాజ్‌ మాత అవతారమే తనోట్‌ మాత అని ‘చరన్‌’ సాహిత్యం తెలుపుతోంది. తనోట్‌ మాత తరువాత కర్ణిమాతగా అవతరించిందని చెబుతారు.

ఒక్క బాంబూ పేలలేదు

అమ్మవారి ఆలయాన్ని భారత రక్షణదళాలు పర్యవేక్షిస్తుంటాయి. 1965, 1971 పాక్‌తో జరిగిన యుద్ధాల్లో అమ్మవారి ప్రభావంతో పాక్‌పై విజయం సాధించినట్టు స్థానికులు చెబుతారు. 1965లో జరిగిన యుద్ధంలో పాక్‌ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీ బలగాలతో పెద్ద ప్రణాళిక వేసింది. ఆ సమయంలో ఆలయ సమీపంలో భారత్‌కు చెందిన కొద్దిమంది సైనికులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారత సైనికులపై పాక్‌ ఏకంగా 3 వేల బాంబులను ప్రయోగించింది. అయితే ఒక్క బాంబు కూడా పేలకపోవడం అమ్మవారి అద్భుతశక్తికి  నిదర్శనమని అక్కడి పెద్దలు చెబుతుంటారు. పన్నాగం పారకపోవడంతో పాక్‌ సైన్యం తోకముడిచింది. అప్పటి నుంచి తనోట్‌ మాత ఆలయానికి వేలాదిమంది సందర్శకులు వస్తున్నారు.

13 శతాబ్ధాల క్రితమే నిర్మాణం..

ఈ ఆలయాన్ని 13 శతాబ్ధాల క్రితమే ఈ ఆలయం నిర్మితమైంది. రాజపుత్ర వంశానికి చెందిన తానురావు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఆ వంశస్థులు ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. 1971 యుద్ధం అనంతరం ఆలయాన్ని సరిహద్దు భద్రతాదళం నిర్వహణలోకి వెళ్లింది. ఆలయాన్ని మరింతగా విస్తరించారు. భారత విజయాలకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో ఒక విజయ స్తంభాన్ని నిర్మించారు. పాక్‌పై విజయానికి గుర్తుగా ఏటా వేడుకలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఒక మ్యూజియం ఉంది. ఇక్కడ పాక్‌ ప్రయోగించి పేలని బాంబులతో పాటు పలు ఆయుధాలను వీక్షించవచ్చు.

ఎలా చేరుకోవాలి..

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో పాక్‌ సరిహద్దుకు ఆనుకొని ఉంటుందీ ఆలయం. జైసల్మేర్‌లో దిగి 120 కి.మీ. ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాలి. జైసల్మేర్‌ నుంచి ట్యాక్సీలు దొరుకుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని