
తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ
ఈనాడు, అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయన వాణిజ్య పన్నులశాఖ అధికారిగా పనిచేసే సమయంలో.. బీకాం చదవక పోయినా, చదివినట్లు తప్పుడు డిగ్రీ పత్రాన్ని సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్కుమార్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్లోనూ తాను గ్రాడ్యుయేట్ అనే సమాచారమిచ్చారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన సర్వీసులో ఉండగానే భాజపాకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశారని పేర్కొన్నారు. దీనిపై గతేడాది జనవరిలో రాష్ట్ర పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ నుంచి లోకాయుక్త నివేదిక తెప్పించుకుంది. సర్వీస్ రిజిస్టర్లో వివరాలను తారుమారు చేయడంపై సమగ్ర విచారణకు సీఐడీకి ఫిర్యాదు చేయాలని గతేడాది ఆగస్టులో ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి సంబంధించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సూచించింది. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అశోక్బాబుపై రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ గీతా మాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్ 477ఎ, 465, 420 కింద కేసులు నమోదయ్యాయి.