కొత్త జిల్లాలపై మళ్లీ కదలిక

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైంది. వైకాపా లోక్‌సభ సభ్యులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల అంశం మరోమారు తెరపైకొచ్చింది. గతేడాది కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావాలన్న

Published : 28 Nov 2021 04:30 IST

వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి..

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైంది. వైకాపా లోక్‌సభ సభ్యులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల అంశం మరోమారు తెరపైకొచ్చింది. గతేడాది కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావాలన్న సీఎంవో ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. తదుపరి ఆదేశాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలను తాత్కాలికంగా పక్కనపెట్టారు. మరోవైపు ఈ ఏడాది మార్చిలో జనగణన పూర్తయ్యే వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక సరిహద్దులను మార్చడానికి వీల్లేదని భారత రిజిస్ట్రార్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైకాపా పార్లమెంటు సభ్యులతో శుక్రవారం జరిగిన సమావేశంలో కొత్తగా జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న దానిపై చర్చ జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జగన్‌ పేర్కొనడంతో ఈ అంశం మరోమారు చర్చల్లో నిలిచింది.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని.. ఇవి 25 లేదా 26 ఉంటాయని గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల వరుస సమావేశాలు హడావుడిగా జరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కానున్న పట్టణానికి మిగిలిన నియోజకవర్గ కేంద్రాల నుంచి దూరం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక, మధ్యకాలిక, శాశ్వత ప్రణాళికలతో వివరాలను సిద్ధం చేశారు. లోక్‌సభ స్థానాలు ప్రామాణికంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అవి 25కు పెరుగుతాయి. అరకు నియోజకవర్గ విస్తీర్ణం పెద్దగా ఉండటంతో దీన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు, ఇతర భవనాలు, ప్రధాన రహదారుల వివరాలు సేకరించారు. వాటిని పరిశీలించారు. లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు, ఇతర వివరాలను హడావుడిగా సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో పోలీసు జిల్లా కార్యాలయాల భవనాలు, స్థలాల సేకరణ, సిబ్బంది కేటాయింపు ఇతర అంశాలపై పోలీసు శాఖ కూడా కొంత కసరత్తు చేసింది. తర్వాత వాటన్నింటినీ తాత్కాలికంగా పక్కనపెట్టారు. అయితే తాజాగా సీఎం చేశారంటున్న వ్యాఖ్యలపై అధికారికంగా తమకు ఎటువంటి సమాచారం రాలేదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని