Smart meter: సర్కారు వారి స్మార్ట్‌ భారం!

రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం ‘స్మార్ట్‌’ షాక్‌ ఇవ్వబోతోంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట పదేళ్లలో రూ.36వేల కోట్ల భారం వేయనుంది.

Updated : 13 Nov 2022 06:11 IST

మీటర్ల ఏర్పాటు.. నిర్వహణకు రూ.36వేల కోట్లు?
ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం కింద ఇళ్లకు మీటర్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం ‘స్మార్ట్‌’ షాక్‌ ఇవ్వబోతోంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట పదేళ్లలో రూ.36వేల కోట్ల భారం వేయనుంది. పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం (రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం-ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద మూడు డిస్కంల పరిధిలోని 1.50 కోట్ల గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు 2025 డిసెంబరు నాటికి దశలవారీగా స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయనుంది. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే వారిని పథకం నుంచి మినహాయించింది. ఈ పథకం అమలు అధికారాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాల డిస్కంలకు కట్టబెట్టింది. తప్పనిసరి చేయలేదు. కానీ, రాష్ట్రప్రభుత్వం మాత్రం వీటిని ఏర్పాటుచేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఇంత మొత్తాన్ని వెచ్చించే ముందు విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థలపై ఇంధనశాఖ చేసిన అధ్యయనం ఏంటి.. వీటివల్ల విద్యుత్‌ సంస్థలకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏంటనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ, కేంద్రప్రభుత్వం తరఫున పీఎఫ్‌సీ (విద్యుత్‌ ఆర్థికసంస్థ) 2022 మార్చి 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీన్ని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం కోసం 2022 మే 12న ప్రభుత్వం పంపింది. మీటర్ల ఏర్పాటు, నిర్వహణ టెండరు ప్రతిపాదనలను డిస్కంలు న్యాయసమీక్షకు పంపాయి.

‘స్మార్ట్‌’ లక్ష్యం మనకెందుకు?

ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం అమలుతో కేంద్రం కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. స్థూల సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్‌ సీ) నష్టాలు 15% కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పథకాన్ని అమలుచేయాలని నిర్దేశించింది. స్మార్ట్‌ మీటర్లు, ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ లైన్ల ఏర్పాటు ద్వారా 2024-25 నాటికి  ఈ నష్టాలను 12-15 శాతానికి తగ్గించాలన్నదే లక్ష్యం. అయితే, రాష్ట్రంలో 2021-22 నాటికే మూడు డిస్కంల సగటు నష్టాలు 11.21%. అయినా పథకాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? దీనివల్ల పరోక్షంగా మీటర్ల తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.

మీటర్ల కొనుగోలు.. నిర్వహణకే రూ.36 వేల కోట్లు

రాష్ట్రంలో సుమారు కోటిన్నర స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మీటరు ధర రూ.6వేలుగా కేంద్రం నిర్దేశించింది. ఇందులో కేంద్రం రూ.900 గ్రాంటుగా ఇస్తుంది. అయినా మిగిలిన భారాన్ని ప్రజలు మోయక తప్పదు. మహారాష్ట్రలో స్మార్ట్‌మీటరు ఏర్పాటు, ఏడున్నరేళ్ల నిర్వహణకు ఒక్కో కనెక్షన్‌కు నెలకు రూ.200.96 ధరను అక్కడి డిస్కంలు ఖరారుచేశాయని ఇంధనశాఖ చెబుతోంది. ఈ లెక్కన ఏడున్నరేళ్లలో రూ.18,086.40 వంతున చెల్లిస్తారు. ఇందులో స్మార్ట్‌మీటర్‌ ధర రూ.6వేలు మినహాయిస్తే.. నిర్వహణ ఛార్జీలు రూ.12,086.40 అవుతాయి. అంటే నెలకు రూ.134.29 వంతున చెల్లించాలి. ఈ రేట్ల ప్రకారమే లెక్కిస్తే.. రాష్ట్రంలో మొదటి విడత ప్రతిపాదించిన 50.69 లక్షల కనెక్షన్లకు మీటర్ల కొనుగోలు, నిర్వహణకు నెలకు రూ.101.87 కోట్లు వెచ్చించాలి. ఏడాదికి రూ.1,222.40 కోట్ల వంతున.. పదేళ్లలో రూ.12,224 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో కనెక్షన్‌కు (మీటర్‌ కొనుగోలుకు రూ.6,896.65, నిర్వహణ ఖర్చు రూ.17,250.13 కలిపి) రూ.24,146.78 వెచ్చిస్తున్నట్లు. దీని ప్రకారం 1.50 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లకు పదేళ్లలో వెచ్చించే మొత్తం రూ.36,220.17 కోట్లు. స్మార్ట్‌మీటర్ల కొనుగోలు, నిర్వహణ ఖర్చువల్ల ప్రజలపై భారం మోపడం తప్ప అదనపు ప్రయోజనం లేదని నిపుణులు అంటున్నారు. ‘రాష్ట్రంలో ప్రతి ఫీడర్‌కూ ప్రత్యేక మీటర్‌ ఉంది. దాన్నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను ప్రతి గంటకూ నమోదు చేస్తున్నారు. ఇప్పుడు పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర మీటర్లు ఏర్పాటుచేస్తే.. విద్యుత్‌ పంపిణీ లెక్కలు పక్కాగా వస్తాయి. ఏ ఫీడర్‌లో విద్యుత్‌ చౌర్యం జరుగుతుందో తెలుస్తుంది. నియంత్రణ చర్యలు చేపట్టవచ్చు’ అని నిపుణులు చెబుతున్నారు.

అదనపు భారాన్ని భర్తీచేయడం సాధ్యమేనా?

ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేస్తే ప్రతినెలా రీడింగ్‌ నమోదుచేయాల్సిన అవసరం ఉండదని, దీనికోసం వెచ్చించే మొత్తం మిగులుతుందని డిస్కంలు చెబుతున్నాయి. మీటర్‌ రీడింగ్‌ నమోదుకు ఒక్కో కనెక్షన్‌కు సగటున రూ.10 వంతున ఖర్చుచేసినట్లు భావిస్తున్నా.. రాష్ట్రంలోని సుమారు 1.50 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లకు ప్రతి నెలా రూ.15 కోట్లు ఖర్చవుతుంది. ఏడాదికి రూ.180 కోట్ల వంతున.. పదేళ్లలో రూ.1,800 కోట్లు. దీనిపై డిస్కంల దగ్గర ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు లేవు. ఇప్పటికే ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను దాదాపు డిస్కంలు చేరుకున్నాయి. అధికారులు చెబుతున్నట్లు రూ.36 వేల కోట్లు ఆదా చేయడం సాధ్యమేనా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని