Dharmana Prasada Rao: ధర్మం తప్పినా మంత్రి దర్జా

1956 ఆగస్టు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 112 మంది దుర్మరణం పాలయ్యారు. సాంకేతిక తప్పిదం వల్ల జరిగిన ఆ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది సంబంధిత అధికారులు, రైల్వేబోర్డు. కానీ ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధాని నెహ్రూకు రాజీనామా లేఖ పంపారు.

Updated : 02 Dec 2022 09:05 IST

భూఅక్రమాలు రుజువైనా ధర్మానపై చర్యలేవి?
మంత్రివర్గంలో ఆయన ఎలా ఉంటున్నారు?
ఆధారాలతో సిట్‌ నిరూపించినా.. సీఎం ఎలా కొనసాగిస్తున్నారు?
ఈనాడు - అమరావతి


1956 ఆగస్టు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 112 మంది దుర్మరణం పాలయ్యారు. సాంకేతిక తప్పిదం వల్ల జరిగిన ఆ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది సంబంధిత అధికారులు, రైల్వేబోర్డు. కానీ ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధాని నెహ్రూకు రాజీనామా లేఖ పంపారు. నెహ్రూ ఆయనను సముదాయించారు. రాజీనామా నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పించారు. అదే ఏడాది నవంబరులో తమిళనాడులోని అరియలూరు వద్ద మరో రైలు ప్రమాదం జరిగింది. 144 మంది మరణించారు. లాల్‌బహదూర్‌శాస్త్రి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈసారి ప్రధాని చెప్పినా వినలేదు. పట్టుబట్టి రాజీనామా ఆమోదింపజేసుకున్నారు.

- ఇది ఆ తరం నాయకుల నిబద్ధత. తరాలు మారుతున్నా, నాయకుల నిబద్ధత గురించి చెప్పాల్సి వస్తే ఈ ఘటననే గుర్తు చేసుకుంటాం.


కానీ..

రూ.వందల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడ్డారని, మంత్రి పదవి ద్వారా సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ విలువైన భూముల్ని కొట్టేశారని దర్యాప్తు బృందం నిగ్గు తేల్చినా నిస్సిగ్గుగా పదవిని పట్టుకుని వేళ్లాడుతున్న నాయకుల గురించి భవిష్యత్‌ తరాలకు ఉదాహరణగా చెప్పాల్సి వస్తే.. కచ్చితంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావునే గుర్తు చేసుకోవాలేమో!


భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆధారాలతో సిట్‌ నిరూపించినా.. ఇప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా పదవిలో కొనసాగుతున్న ధర్మానను, ఆయనను మంత్రివర్గంలో కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌నూ ఏమనాలి? ధర్మాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో రెవెన్యూ మంత్రిగా ఉండగా, విశాఖలో 71.29 ఎకరాల భూకుంభకోణానికి పాల్పడ్డారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి స్వాత్రంత్య్ర సమరయోధులకు కేటాయించిన డీ ఫాం పట్టా భూములకు ఎన్వోసీలు ఇప్పించి, వాటిని ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు కట్టబెట్టారని సిట్‌ తన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నా ధర్మానపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆయనను మంత్రివర్గం నుంచి ఎందుకు బర్తరఫ్‌ చేయడం లేదు? ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి హోదాలో ఉండి... కంచే చేను మేసినట్టు ధర్మాన అక్రమ మార్గాల్లో భూములు కొట్టేశారని రుజువైనా ముఖ్యమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఆధారాలతో కుంభకోణం బయటపడ్డా.. ఆయన నిర్వాకాన్ని సిట్‌ పేజీల కొద్దీ నివేదికలో ఎండగట్టినా ధర్మానకు చీమ కుట్టినట్టయినా లేదా? ఇవీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలనుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. ‘ఎన్వోసీలపై నిర్ణయం తీసుకునేది మంత్రి కాదు. రెవెన్యూ మంత్రికి జిల్లా స్థాయిలో కార్యకలాపాలతో సంబంధం ఉండదు. జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారుల స్థాయిలోనే ఆ నిర్ణయాలు జరుగుతాయి. అయినా మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే ఎలా? ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నందుకే నాలాంటి వాళ్ల పీక నొక్కాలని కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. నా నోరు మూసేందుకే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. నాది 40 ఏళ్ల రాజకీయ జీవితం. నా వ్యక్తిత్వంపై మచ్చ వేయడం వారి తరం కాదు. మీరు రాసినా, ఫొటోలు వేసినా బెదిరిపోయే వ్యక్తిని కాను. విశాఖలో ఒక్క భూమి విషయంలో నా ప్రమేయాన్ని నిరూపించినా ఆ భూములు రాసిస్తాను’

- విశాఖ భూకుంభకోణంలో ధర్మాన పాత్రపై సిట్‌ నివేదిక బయటకు వచ్చాక వివిధ సందర్భాల్లో ఆయన స్పందన ఇదీ! కానీ ఆ భూములు అక్రమ మార్గాల్లో తన భార్య, కుమారుడి పేరు మీదకు, తమ్ముడు, సన్నిహితులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లోకి బదిలీ కాలేదని ధర్మాన ఎప్పుడూ చెప్పలేదు. సిట్‌ నివేదికలో పేర్కొన్న అంశాల్ని ఖండించనూ లేదు. మసిపూసి మారేడుకాయ చేస్తోంది ఎవరు ధర్మాన గారూ? విశాఖ భూకుంభకోణాల్లో ప్రధాన సూత్రధారి మీరేనని, ఎంతో చాకచక్యంగా పావులు కదిపి ఆ భూముల్ని హస్తగతం చేసుకున్నారని సిట్‌ సాక్ష్యాధారాలతో సోదాహరణంగా నిగ్గు తేలిస్తే.. ఇంకా ఏం నిరూపించాలి? ఎవరు నిరూపించాలి? తప్పు జరిగిందని అంగీకరించి, నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాల్సిందిపోయి ఎదురుదాడేంటి?

బుకాయిస్తే.. తప్పులు ఒప్పులైపోతాయా?

విశాఖ భూకుంభకోణంపై దర్యాప్తు చేసింది ఏ మంత్రుల బృందమో కాదు. వారంతా రాజకీయ నాయకులు కాబట్టి లేనిపోని బురదజల్లుతున్నారని తప్పించుకోవడానికి. అప్పట్లో గ్రేహౌండ్స్‌ డీఐజీగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌, విశాఖ సంయుక్త కలెక్టర్‌ జి.సృజన, డిప్యూటీ కలెక్టర్‌ విజయసారథి... పలు సబ్‌ కమిటీలు వేసుకుని, కొన్ని నెలలపాటు శ్రమించి, కొన్ని వేల దస్త్రాల్ని, పత్రాల్ని క్షుణ్నంగా శోధించి.. వేల పేజీల నివేదిక రూపొందించారు. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, రాష్ట్ర విభజన తర్వాత గానీ భూకుంభకోణాలపై అంత సాధికారికంగా, ఆధారసహితంగా, దోషులెవరో, వారి పాత్ర ఏమిటో సూటిగా, స్పష్టంగా చెప్పిన నివేదిక ఇదే కావచ్చు. విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో ధర్మాన కుటుంబం 71.29 ఎకరాల భూకుంభకోణానికి పాల్పడిందని, రెవెన్యూ మంత్రిగా ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సిట్‌ ఆధారాలతో నిరూపించింది. విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన ఎసైన్డ్‌ భూములకు నిరభ్యంతర పత్రాల కోసం వచ్చిన దరఖాస్తుల్ని ధర్మాన స్వయంగా ఎండార్స్‌ చేసి జిల్లా అధికారులకు పంపించారని, ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఆ భూములకు ఎన్వోసీలు వచ్చాయని, సామాన్యులకు అలా ఎన్వోసీలు దక్కే ఆస్కారమే లేదని సిట్‌ పేర్కొంది. మధురవాడలో మాజీ సైనికోద్యోగి మాదాబత్తుల అప్పారావు పేరిట ఉన్న ఐదు ఎకరాల డీ ఫాం భూమిని.. ధర్మాన స్వయంగా చెప్పడం వల్లే తాను కొన్నానని, తర్వాత ధర్మాన కుటుంబసభ్యుల పేరు మీద బదలాయించానని గుబ్బల గోపాలకృష్ణ అనే వ్యక్తి సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దానిలో తాను ఒక రూపాయీ పెట్టలేదని, తనకూ రూపాయీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ గోపాలకృష్ణ ధర్మానకు అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబ కంపెనీలో డైరెక్టరూ అయిన ఐబీ కుమార్‌కు స్వయంగా మామ. సొంత మనుషులు, అప్పట్లో ధర్మాన ప్రలోభపెట్టడం వల్లో, ఒత్తిడి తేవడం వల్లో కుట్రలో భాగస్వాములైనవారే ఏం జరిగిందో అంత స్పష్టంగా చెబితే.. ఇంకా బుకాయింపులు, హూంకరింపులతో ఎవరిని నమ్మించి మోసగించాలనుకుంటున్నారో ధర్మానకే తెలియాలి.

విశాఖలో భూఅక్రమాలపై చోద్యం చూస్తోంది అందుకేనా?

విశాఖలో వైఎస్‌ ప్రభుత్వ హయాంకంటే ఎక్కువగా ఇప్పుడు భూకుంభకోణాలు జరుగుతున్నాయి. భూయజమానులకు ఒక శాతం వాటా ఇచ్చి తాను 99 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్న.. ప్రజాప్రతినిధిగా ఉన్న బిల్డర్‌ ఒకరు, విశాఖ నడిబొడ్డున రూ.కోట్ల విలువ చేసే దసపల్లా భూముల్ని వాటి యజమానులు అంటున్నవారికి 30 శాతం ఇచ్చి.. తాము 70 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్న అధికార పార్టీ నేతల బినామీలు మరికొందరు, చర్చి భూములకే ఎసరు పెట్టిన ప్రజాప్రతినిధి ఒకరు, అనకాపల్లి జిల్లా బయ్యవరంలో ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూముల్ని కొట్టేసిన అధికార పార్టీ ప్రబుద్ధులు మరికొందరు. విశాఖలో ఇన్ని భూఅక్రమాలు జరుగుతున్నా, రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా.. వాటిని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి ధర్మాన చోద్యం చూస్తున్నారే తప్ప కనీసం పట్టించుకోవడం లేదు. వాటిపై సమీక్ష లేదు. విచారణకు ఆదేశాల్లేవు. దసపల్లా భూముల్ని ఇప్పుడు 22 (ఎ) నుంచి తీసేసి... ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ మంత్రిగా ఆ భూముల్ని కాపాడాల్సిన ధర్మాన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. విశాఖ భూఅక్రమాలపై చర్యలకు ఉపక్రమిస్తే తన భూదందాల చిట్టా బయటకు తీస్తారన్న భయమో, ఉన్న పదవీ ఊడిపోతుందన్న ఆందోళనో తెలియదు గానీ ఆయన మాత్రం... సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా కనీసం అక్కడేం జరుగుతోందని కూడా ఆరా తీయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


కిరణ్‌ చేసింది.. జగన్‌ ఎందుకు చేయరు?

విశాఖలో ఏకంగా 71.29 ఎకరాల భూముల్ని ధర్మాన చాకచక్యంగా కొట్టేశారని సిట్‌ అంత వివరంగా నివేదిక ఇచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు గుంభనంగా ఉంటున్నారు? ధర్మానపై చర్యలు తీసుకోవడానికి, ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నారు? వాన్‌పిక్‌, లేపాక్షి, పెన్నా సిమెంట్స్‌కు భూకేటాయింపుల కేసుల్లో సహనిందితుడైన ధర్మానను కేబినెట్‌ నుంచి బయటకు పంపించడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్నామని, తద్వారా ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల విలువైన సంపదను అందజేశానని ఊదరగొడుతున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ధర్మాన అక్రమంగా హస్తగతం చేసుకున్న భూముల జోలికి ఎందుకు వెళ్లలేదు? ఆ కుంభకోణం గురించి సాయిరెడ్డి నోరు ఎందుకు పెగలడం లేదు? ఇలాంటి ప్రశ్నలే అనేకం తలెత్తుతున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, గనులశాఖ మంత్రులుగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. అప్పటికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ధర్మాన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా, సబిత హోంమంత్రిగా ఉన్నారు. వారిద్దరితో కిరణ్‌ రాజీనామా చేయించారు. అదే వైఎస్‌ కేబినెట్‌లో రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడే ధర్మాన విశాఖలో భూకుంభకోణానికి పాల్పడ్డారని, దానిలో మంత్రి కుటుంబానికే వ్యక్తిగత లబ్ధి చేకూరిందని సిట్‌ తేల్చింది. అయినా ఆయనతో ముఖ్యమంత్రి జగన్‌ రాజీనామా చేయించకపోవడంలోని ఔచిత్యమేంటి?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని