AP High Court: అత్తమామల నుంచి పిల్లల్ని తండ్రి తీసుకెళ్లడం కిడ్నాప్‌ కాదు: ఏపీ హైకోర్టు

అత్తమామల వద్ద ఉన్న పిల్లలను తీసుకెళ్లినందుకు ఓ తండ్రి, ఆయన బంధువుపై పోలీసులు కిడ్నాప్‌ కేసు(ఐపీసీ 363) నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

Updated : 25 May 2023 08:13 IST

మహ్మదీయ చట్టం ప్రకారం నాన్న చట్టబద్ధ సంరక్షకుడు
పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం

ఈనాడు, అమరావతి: అత్తమామల వద్ద ఉన్న పిల్లలను తీసుకెళ్లినందుకు ఓ తండ్రి, ఆయన బంధువుపై పోలీసులు కిడ్నాప్‌ కేసు(ఐపీసీ 363) నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారిపై నమోదు చేసిన కేసును కొట్టేసింది. సున్నీ మహ్మదీయ చట్టం ప్రకారం పిల్లలకు తండ్రి చట్టబద్ధ సంరక్షకుడని గుర్తుచేసింది. పిల్లలపై తల్లి హక్కు అపరిమితమైనది కాదని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్న పిల్లలను భర్త, మరొకరితో కలిసి కిడ్నాప్‌ చేశారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు 2022 సెప్టెంబరు 24న కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలంటూ పిల్లల తండ్రి, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫు న్యాయవాది వరుణ్‌ బైరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లపై నమోదు చేసిన కిడ్నాప్‌ కేసు చెల్లుబాటు కాదన్నారు. సున్నీ మహ్మదీయ లా ప్రకారం కుమారుడికి ఏడు, షియా మహ్మదీయ లా ప్రకారం రెండేళ్లు వచ్చేంత వరకు మాత్రమే తల్లి సంరక్షణలో ఉంచుకోగలదన్నారు. సున్నీ మహ్మదీయ చట్ట ప్రకారం మైనర్లకు తండ్రి సహజ, ప్రాథమిక సంరక్షకుడని పేర్కొన్నారు. పిల్లలను తీసుకెళ్లిన సమయంలో ఒకరికి 8, మరొకరికి 10 ఏళ్లు ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. మహ్మదీయ చట్ట నిబంధనల ప్రకారం కొంత వయసు వరకే పిల్లలకు తల్లి సంరక్షకురాలిగా ఉంటారన్నారు. నిర్ధిష్టమైన వయసు మించిన పిల్లలకు తండ్రి సహజ, చట్టబద్ధ సంరక్షకుడవుతారని స్పష్టం చేశారు. చట్టబద్ధ సంరక్షకుడు పిల్లల్ని తీసుకెళ్లడం కిడ్నాప్‌గా పరిగణించలేమని స్పష్టం చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని