అంతా అనుమానాస్పదమే!

విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది.

Updated : 23 Mar 2024 11:02 IST

వైకాపా పెద్దల జోక్యం లేకుండా సీబీఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా?
కలకలం రేపిన డ్రగ్స్‌ కంటెయినర్‌
పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు
సీబీఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ
‘సంధ్య ఆక్వా’ ప్రతినిధుల ఫోన్‌ కాల్స్‌, నగదు లావాదేవీలపై ఆరా
ఈనాడు - విశాఖపట్నం

విశాఖ పోర్టుకు ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ మాటున భారీగా డ్రగ్స్‌ దిగుమతవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారుల విచారణకు ఓ దశలో కొందరు అధికారులు ఆటంకం కలిగించారన్న విషయం అందరి దృష్టిలో పడింది. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే అలా చేయగలరా అనే ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది. ఈ నౌక సకాలంలో వస్తే ఫిబ్రవరికే విశాఖ చేరుకునేది. వివిధ కారణాలతో జాప్యం కావడంతో ఎన్నికల కోడ్‌ వచ్చాక మార్చి 16న విశాఖకు చేరింది. ముందే వచ్చి ఉంటే సీబీఐ పట్టుకున్నా, అవినాష్‌రెడ్డి కేసు విషయంలో సీబీఐ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే.. ఈ డ్రగ్స్‌ కేసులోనూ పునరావృతమయ్యేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరలవుతున్నాయి.

నమూనాల సేకరణ

పట్టుకున్న కంటెయినర్‌లోని కొకైన్‌ నిల్వలను సీబీఐ జడ్జి శుక్రవారం పరిశీలించారు. జడ్జి సమక్షంలో కంటెయినర్‌లోని వెయ్యి బ్యాగుల నుంచి పసుపు రంగులోని పౌడర్‌ నమూనాలు సేకరించారు. నమూనాల సేకరణ సమయంలో సీబీఐ అధికారులతోపాటు సంధ్య ఆక్వా ప్రతినిధులు ఉన్నారు. వీటిని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ (సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ)కు తరలించి కేజీ ఈస్ట్‌లో కొకైన్‌ వంటి డ్రగ్స్‌ పరిమాణం ఎంత ఉందనేది నిర్ధారణ చేయనున్నారు. దీనికి రెండు వారాలు పడుతుందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. బ్రెజిల్‌లో ఆర్డర్‌ బుక్‌ చేసిన ఏజెన్సీ వివరాలు, సంప్రదించిన సమయంలో ఫోన్‌ కాల్‌ డేటా, నగదు లావాదేవీలపైనా ఆరా తీసినట్లు సమాచారం.

ఆరా తీసే సమయానికే దాటిపోయిన నౌక

బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్టు నుంచి డ్రైడ్‌ ఈస్ట్‌తో ఉన్న కంటెయినర్‌ ఈ ఏడాది జనవరి 14న చైనా నౌకలో బయలుదేరింది. ఫిబ్రవరికే విశాఖ చేరాల్సి ఉన్నా జాప్యమై ఈ నెల 16న విశాఖకు ‘వన్‌ లైన్‌’లో వచ్చింది. ఇంటర్‌పోల్‌ సమాచారంతో సీబీఐ రంగప్రవేశం చేసి కూపీ లాగడం మొదలుపెట్టింది. పూర్తిస్థాయిలో ఆరా తీసేసరికే ఆ నౌక తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు వెళ్లింది. అక్కడ కస్టమ్స్‌ అధికారుల సమన్వయంతో నౌక అధికారులను ప్రశ్నించగా ఈస్ట్‌తో ఉన్న కంటెయినర్‌ను విశాఖ పోర్టులో జేఎం భక్షి గ్రూప్‌ బెర్త్‌లో దించినట్లు వెల్లడించారు. దీంతో దిల్లీ నుంచి సీబీఐ అధికారులు నేరుగా 18వ తేదీ విశాఖకు చేరుకున్నారు.

డాగ్‌ స్క్వాడ్‌ అడిగితే సీపీ ఎందుకెళ్లారు?

‘ఆంధ్రప్రదేశ్‌ అధికారులు, పోర్టు ఉద్యోగులు ఆటంకం కలిగించడం వల్ల విచారణ జాప్యమైంది’ అని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. వైకాపా పెద్దల ఒత్తిళ్లు లేకుండానే అధికారులు సీబీఐని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎప్పుడూ జేసీపీ, డీసీపీలతో కలిసి ప్రెస్‌మీట్‌ నిర్వహించే విశాఖ సీపీ శుక్రవారం హడావుడిగా ఒక్కరే విలేకర్లతో మాట్లాడారు. విశాఖ అధికారుల వల్ల విచారణ జాప్యమైందనే ప్రచారం అవాస్తవమన్నారు. కస్టమ్స్‌ ఎస్పీ అభ్యర్థన మేరకే పోర్టుకు డాగ్‌ స్క్వాడ్‌ పంపామని, అక్కడికి వెళ్లాక డాగ్‌ స్క్వాడ్‌ అవసరం లేదని పోర్టు కస్టమ్స్‌ ఎస్పీ, సీబీఐ డీఎస్పీ చెప్పడంతో వెంటనే తిరిగి వచ్చేశామన్నారు. ‘సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వాడిన పదం టెక్నికల్‌ టర్మ్‌ కోసం రాశారు తప్ప ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోలేదు’ అని స్పష్టత ఇవ్వడానికి ప్రెస్‌మీట్‌ పెట్టామన్నారు. అసలు డాగ్‌స్క్వాడ్‌ ఎందుకు కావాలన్నారు? ఎందుకు వద్దన్నారు? డాగ్‌స్క్వాడ్‌ను పంపమంటే.. సీపీ స్వయంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డాగ్‌స్క్వాడ్‌, కంటెయినర్‌ సిబ్బంది ఒక్కసారిగా రావడంతో చిత్రీకరిస్తున్న వీడియోకు కొంత అంతరాయం కలిగిందనే కారణంతో ఎఫ్‌ఐఆర్‌లో అలా రాసినట్లు సీబీఐ చెప్పిందంటూ సీపీ ముక్తాయించారు.

డ్రైడ్‌ ఈస్ట్‌లో డ్రగ్స్‌ అవశేషాలు ఎందుకుంటాయి?

డ్రైడ్‌ ఈస్ట్‌లో కొకైన్‌, హెరాయిన్‌ తదితర నిషేధిత డ్రగ్స్‌ అవక్షేపాలు ఉండే అవకాశమే లేదు. ఇటువంటి నిషేధిత డ్రగ్స్‌ అవక్షేపాలు ఉండాలంటే కచ్చితంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించాలని నిపుణులు చెబుతున్నారు.  బ్రెజిల్‌ నుంచి వచ్చిన డ్రైడ్‌ ఈస్ట్‌లో కొకైన్‌ వంటి డ్రగ్స్‌ పెట్టి, రవాణా చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ నాట్కో పరీక్షల్లో గుర్తించిన ఆరు డ్రగ్స్‌.. అత్యంత ప్రమాదకరమైనవని, ఇవి తీసుకుంటే శరీరంలోని నాడీవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


విశాఖ పోర్టునే ఎందుకు ఎంచుకుంటున్నారు?

విశాఖ పోర్టులో నౌకల్లోకి ఎక్కించే కంటెయినర్లలో కొన్నింటిని మాత్రమే ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. అనుమానం వస్తేనే మొత్తం తనిఖీ చేస్తారు. స్కానింగ్‌ సైతం ఇటీవలే మొదలుపెట్టారు. అంతకుముందు అదీ లేదు. ఈ కారణాలతోనే విశాఖ పోర్టును కొందరు అక్రమార్కులు ఎగుమతి, దిగుమతులకు ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాలు కలిగిన 25వేల కిలోల ఈస్ట్‌ పొడిని ధైర్యంగా పంపారని భావిస్తున్నారు. ఆర్డర్‌ బుక్‌ చేయడం ఇదే మొదటిసారి అని సంధ్య ఆక్వా ప్రతినిధులు చెబుతున్నప్పటికీ, కొంతకాలంగా యూరోపియన్‌ దేశాల నుంచి విశాఖకు డ్రైడ్‌ ఈస్ట్‌ దిగుమతి అవుతూనే ఉంది. కొవిడ్‌కు ముందు భీమవరం పరిధిలో రొయ్యల చెరువుల కోసం డ్రైడ్‌ ఈస్ట్‌ దిగుమతి చేసి తీసుకెళ్లేవారని టెర్మినల్‌లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని