సరైన విలువలోనే భారత మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తున్న వేళ, భారత స్టాక్‌ మార్కెట్లు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.

Published : 25 Nov 2022 03:51 IST

మార్కెట్‌ విలువ, జీడీపీ నిష్పత్తి భేష్‌
వారెన్‌ బఫెట్‌ నమ్మే సూత్రమిదే

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తున్న వేళ, భారత స్టాక్‌ మార్కెట్లు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి. ఎమ్‌ఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లో దేశ వెయిటేజీ పెరగడానికి తోడు, ఎప్పటి నుంచో ఇందులో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉన్న చైనాను వెనక్కి నెట్టడం మరో విశేషం. భారత ఆర్థిక వ్యవస్థ రాణిస్తుండడంతో.. స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంటు సానుకూలంగా మారడం హేతుబద్ధమేనని విశ్లేషకులు అంటున్నారు.

సందేహాలు ఎందుకంటే..: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు అంతర్జాతీయ సంస్థలు తగ్గించాయి. అయినా కూడా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగవంతమైన వృద్ధి కనిపిస్తోంది మన దేశంలోనే.    2022-23లో జీడీపీ వృద్ధి 7 శాతం నమోదు కావొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ఇతర సంస్థల అంచనాలు దీని కంటే తక్కువగా ఉన్నాయి. ఇందుకు భిన్నంగా సరికొత్త గరిష్ఠాలకు దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్లను చూస్తే, ఆర్థిక వ్యవస్థలోని వాస్తవ మందగమనాన్ని స్టాక్‌ మార్కెట్లు గుర్తించడం లేదా అనిపించొచ్చు.

ఇది కీలకం: ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్‌ బఫెట్‌ మార్కెట్ల విషయంలో నమ్మే ఒక అంశాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్‌ విలువకు, వాస్తవ జీడీపీకి నిష్పత్తిని పరిశీలిస్తే.. 100 శాతం వద్ద  ఉన్న ఏ మార్కెట్‌ అయినా.. సరైన విలువలోనే ఉన్నట్లు లెక్క. 100 శాతం లోపు ఉంటే, కొనుగోళ్లకు అవకాశాలున్నట్లే. భారత్‌ విషయానికొస్తే.. ప్రస్తుత మార్కెట్‌ విలువ, 2022-23 వాస్తవ జీడీపీ అంచనాల నిష్పత్తిని చూస్తే 100.13 శాతంగా ఉంది. ఈ నిష్పత్తి విషయంలో చైనా, జర్మనీ కంటే చాలా ఎత్తులో భారత్‌ ఉండగా..మన కంటే అమెరికా, జపాన్‌ మెరుగ్గా కనిపిస్తున్నాయి.

అయితే.. ఎగుమతులు బాగా క్షీణించినా.. విదేశీ మూలధనం తరలిపోయినా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా.. పరిస్థితుల్లో కొంత మార్పులు రావొచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని