Budget 2023: మార్కెట్‌ మూడ్‌.. గత12 బడ్జెట్లకు సూచీల స్పందన ఇలా..!

ఈ సారి బడ్జెట్‌ మార్కెట్లను దిశను నిర్ణయించనుంది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోతలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రానున్న ఈ బడ్జెట్‌పై మదుపర్ల అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో బడ్జెట్‌ రోజుల్లోనే మార్కెట్లు తమ స్పందనను తెలియజేశాయి. అవి ఎలా ఉన్నాయో తెలుసుకొందాం.. 

Updated : 28 Jan 2023 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్‌ నాడు మార్కెట్‌ పల్స్‌ పట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన రోజు ఒక రకంగా స్పందించిన మార్కెట్లు.. కొద్ది రోజుల్లోనే పూర్తి భిన్నమైన దిశగా పయనించాయి. గత పదేళ్లలో తాత్కాలిక బడ్జెట్లతో సహా మొత్తం నలుగురు ఆర్థిక మంత్రులు 12 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వీటిల్లో కేవలం ఆరు సార్లు మాత్రమే మార్కెట్‌ సూచీలు సానుకూలంగా స్పందించాయి. ఆ రోజుల్లో మార్కెట్లు చాలా తీవ్రమైన కుదుపులకు గురయ్యాయి. ఒక సందర్భంలో మార్కెట్‌ సూచీ నిఫ్టీ ఏకంగా 2.5శాతం నష్టపోగా.. మరోసారి ఏకంగా 4.7శాతం లాభపడింది. ఈ స్థాయి కుదుపుల్లో చిన్న మదుపర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. నెల రోజుల తర్వాత కూడా ఆరు సందర్భాల్లో నిఫ్టీ ప్రతికూల పరిస్థితుల్లోనే కొనసాగింది. అందుకే గత పదేళ్లుగా బడ్జెట్ల సమయంలో మార్కెట్లు ఎలా స్పందించాయో చూద్దాం. 

*2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, ఇది దలాల్‌ స్ట్రీట్‌ను ఏమాత్రం ఆకర్షించలేదు. దీంతో నిఫ్టీ ఏకంగా 2శాతం విలువ కోల్పోయింది. దాదాపు నెల రోజుల తర్వాత కూడా 0.2 నష్టాల్లో కొనసాగింది. 2009 బడ్జెట్‌ తర్వాత మార్కెట్‌ ఈ స్థాయి నష్టాలను చవిచూసింది. 2014లో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ను ఆకర్షించింది. 

*  2014లో మోదీ సర్కారు తొలిసారి అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లి జులై 10న ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ మదుపర్లను స్వల్పంగా నిరాశపరిచింది. దీంతో  నిఫ్టీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. కానీ, నెల రోజుల తర్వాత సూచీ 0.8శాతం లాభాల్లోకి వెళ్లింది.

* 2015లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తొలి రోజు మార్కెట్‌ను సంతోషపెట్టినా.. ఆ తర్వాత నష్టాల్లో ముంచేసింది. బడ్జెట్‌ రోజు నిఫ్టీ 0.7శాతం లాభపడింది. ఇక నెల తర్వాత భారీగా పతనమైంది. 4.6శాతం విలువ కోల్పోయింది. 

* 2016లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ను తాత్కాలికంగా నిరాశకు గురిచేసింది. 0.6శాతం విలువ పతనం అయింది. కానీ, ఆ తర్వాత నుంచి మార్కెట్‌ భారీ లాభాల్లో పయనించింది. నెల రోజుల తర్వాత నిఫ్టీ ఏకంగా 10.7శాతం లాభపడింది.

* 2017లో భారత్‌ చాలా కొత్త సంప్రదాయాలను ప్రారంభించింది. రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం మానేసింది. అంతేకాదు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఈ సారి బడ్జెట్‌ ప్రతిపాదనలు మార్కెట్‌లో భారీ ర్యాలీకి దారితీసి నిఫ్టీ 1.8శాతం లాభపడింది. 2011-20 మధ్యలో అతిపెద్ద బడ్జెట్‌ ర్యాలీ ఈ సంవత్సరం చోటు చేసుకొంది.

* కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లి తుది బడ్జెట్‌ను 2018లో సమర్పించారు. జీఎస్‌టీని తొలిసారి ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్‌లోనే. ఈ బడ్జెట్‌ దలాల్‌ స్ట్రీట్‌ను ఏమాత్రం ఆకర్షించలేదు. సూచీలు 0.2శాతం నష్టపోయాయి. నెల రోజుల తర్వాత నిఫ్టీ ఏకంగా 6శాతం విలువ కోల్పోయింది. 2011-21 మధ్యలో ఒక నెలరోజుల్లో నిఫ్టీ చవి చూసిన రెండో అతిపెద్ద పతనం ఇది. 2019లో ఆర్థిక మంత్రిగా పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మదుపర్లను ఆకర్షించింది. దీంతో నిఫ్టీ 0.6శాతం లాభపడింది. 

* మోదీ 2.0 సర్కారులో నిర్మలా సీతారామన్‌ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ కూడా మదుపరులను ఆకర్షించలేదు. పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లోని చాలా ప్రధాన విషయాల్లో నిర్మల సీతారామన్‌ స్పష్టత ఇవ్వలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో నిఫ్టీ 1.1శాతం నష్టపోయింది. ఆ తర్వాత నెల రోజుల్లో 8శాతం విలువ కోల్పోయింది.  2011-21 మధ్యలో ఈ స్థాయిలో సూచీలు ఎప్పుడూ పతనం కాలేదు. 

* 2020లో బడ్జెట్‌ కూడా మదుపర్ల అంచనాను చేరుకోలేదు. దీంతో అదే రోజు 2.5 శాతం పతనమైంది. 

* 2021 బడ్జెట్‌కి దలాల్‌ స్ట్రీట్‌ ఉరకలు వేసింది. మార్కెట్‌ ఏకంగా 4.7శాతం లాభపడింది. 1999 తర్వాత మార్కెట్‌ బడ్జెట్‌ రోజు ఈ స్థాయిలో లాభపడటం ఇదే. 

* ఇక 2022లో మార్కెట్లు  బడ్జెట్‌ రోజు సానుకూలంగానే స్పందించింది. 1.4శాతం నిఫ్టీ పెరిగినా.. ఆ తర్వాత మెల్లగా సూచీ పతనమైంది. నెలరోజులు తిరిగేసరికి నిఫ్టీ  4.5శాతం నష్టాలను మూటగట్టుకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని