కాంగ్రెస్‌ నాయకుడి దారుణ హత్య

ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు.

Published : 05 May 2024 05:47 IST

రంజిత్‌రెడ్డి సభ ఏర్పాట్లలో ఉండగా ఘటన

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. దాడిలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హసన్‌నగర్‌లో చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో శనివారం చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి కాటేదాన్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అక్కడి నుంచి ఆయన శాస్త్రిపురం, హసన్‌నగర్‌లో రోడ్‌షోకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో హసన్‌గర్‌లోని ఇందిరానగర్‌ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్‌ డివిజన్‌ స్థాయి నాయకుడు మక్బూల్‌ (62) నేతృత్వంలో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అప్పటికే స్థానిక మహిళలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడికి చేరుకొని రంజిత్‌రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో స్థానికంగా ఉండే అంజద్‌ అక్కడి చేరుకొని మక్బూల్‌తో గొడవకు దిగాడు. అందరూ చూస్తుండగానే కత్తితో మక్బూల్‌ గొంతును విచక్షణ రహితంగా కోశాడు. తర్వాత మక్బూల్‌ సహచరుడు మనోజ్‌పైనా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మక్బూల్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మనోజ్‌కు ప్రాణాపాయం లేదన్నారు. రోడ్‌ షో ముగించుకొని శాస్త్రిపురం బయలుదేరిన రంజిత్‌రెడ్డికి హత్య విషయం తెలిసి.. హసన్‌నగర్‌ రోడ్‌షోకు రాకుండా వెళ్లిపోయారు. నిందితుణ్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని