logo

ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం

‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్‌ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌ కల్యాణ్‌ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం.

Published : 06 May 2024 02:11 IST

కేంద్ర సాయంతో యువతకు ఉపాధి.. మహిళలకు సాధికారత
‘ఈనాడు’ ముఖాముఖిలో అరకు ఎంపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత

ఈనాడు, పాడేరు - న్యూస్‌టుడే, అరకులోయ: ‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్‌ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్‌ కల్యాణ్‌ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. రాష్ట్రంలో కూటమి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌కు కేంద్రంలో మోదీ సంకల్ప్‌పత్ర్‌ జతచేసి సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు వెళతామని అరకు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత పేర్కొన్నారు. గిరిజన ప్రాంత సమాహారంగా ఉన్న అరకు పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రూపొందించిన కార్యాచరణ వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పనకు పెద్దపీట ..

‘జిల్లా జనాభాలో చదువుకున్న యువత 40 శాతం మంది ఉన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ యువత జీవితాలను నిర్వీర్యం చేసేశారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించడానికి చర్యలు తీసుకుంటాం. నిరుద్యోగ భృతి నెలకి రూ. 3 వేలు అందిస్తాం. సూపర్‌ సిక్స్‌ ద్వారా ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించాం. కేంద్ర ప్రభుత్వం యువశక్తి కార్యక్రమం ద్వారా వారికి నైపుణ్య శిక్షణ ఇస్తాం. కూటమి అధికారంలోకి రాగానే పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాం. నిరుద్యోగ యువతకి రాయితీపై బ్యాంకు రుణాలు, ముద్ర రుణాలను రూ. 20 లక్షల వరకు అందిస్తాం. యువత వారి కాళ్లపై వారు నిలబడే విధంగా నియోజకవర్గాలవారీగా నైపుణ్య శిక్ష అందించి వారికి ఉపాధి అవకాశాలు చూపించి నిరుద్యోగిత తగ్గించడానికి ప్రాధాన్యం ఇస్తా.

రైతు పక్షపాతిగా వ్యవహరిస్తాం....

రైతులు ఏటా రెండు పంటలు పండించుకునేలా సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తాం. మన్యంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా చెక్‌డ్యామ్‌లను ప్రతి మండలానికి కనీసం 10 చొప్పున నిర్మిస్తాం. చెక్‌డ్యామ్‌ల ఏర్పాటు ద్వారా నియోజకవర్గ పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించే అవకాశం ఉంది.

ఉద్యోగులకు తోడుగా ఉంటాం..

వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను శత్రువులుగా చూసింది. ఏనాడు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పాపానపోలేదు. వారికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదు. అడిగితే కేసులతో వేధించారు. మేం అధికారంలోకి వచ్చాక సుహృద్భావ వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా చూస్తాం. జీతభత్యాలు సకాలంలో అందేలా చూస్తాం. అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా పాలన సాగిస్తాం.

6 లక్షల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌బండలు

‘మహిళల ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కూటమి తోడుగా నిలుస్తుంది. సూపర్‌ సిక్స్‌ ద్వారా మహిళల కోసం చాలా పథకాలను ప్రకటించారు. రూ. 10 లక్షల వరకు పొదుపు రుణాలపై వడ్డీ లేకుండానే ఇవ్వబోతున్నాం. దీనివల్ల నియోజకవర్గ పరిధిలోని 50 వేల డ్వాక్రా సంఘాల్లోని 5 లక్షల మంది పొదుపు మహిళలకు సున్నా వడ్డీ లబ్ధి చేకూరుతుంది.  ఇంటింటికీ మూడు గ్యాస్‌ బండలు ఉచితంగా ఇవ్వబోతున్నాం. నియోజకవర్గంలో 6 లక్షల కుటుంబాలకు ఈ ఉచిత సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 చొప్పున ఇవ్వనున్నారు. నియోజకవర్గంలో 6.5 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో ఉద్యోగినులు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ లభించేలా వారిలో నైపుణ్యం అందిస్తాం.

పింఛను రూ.4వేలకు పెంపు

వైకాపా ప్రభుత్వం ఒకచేత్తో రూ. 10 ఇచ్చి మరో చేత్తో రూ. 100 తీసుకుంటోంది. సంక్షేమ పథకాలకు కొర్రీలు పెట్టి కోతలు విధిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంక్షలు లేని సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం. సామాజిక భద్రత పింఛను రూ. 4 వేలకు పెంచడమే కాదు.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తాం.

సామాజిక వర్గాలన్నింటికీ సమ ప్రాధాన్యం

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తాం. వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పథకాలను 36 వరకు రద్దుచేసింది. వాటన్నింటిని పునరుద్ధరిస్తాం. కార్పొరేషన్లు పెట్టి ఆర్థికంగా ఆదుకుంటాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిని లబ్ధిదారులకు చేరువ చేస్తాను. ఎస్సీ, ఎస్టీల భద్రతకి వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలనూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు. ఆయా పథకాలన్నింటినీ పేదలకు అందిస్తాం. ట్రైకార్‌ రుణాలను పునరుద్ధరించి యువత స్వయం ఉపాధికి చర్యలు తీసుకుంటాం. పండుగల సమయంలో కానుకలు ఇచ్చినట్లు రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలు అందిస్తాం. కేంద్రప్రభుత్వం అందించే జన్‌ధన్‌, ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పేదలందరికీ మేలు జరుగుతుంది. కుటుంబంలోని ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా లబ్ధి చేకూరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని