logo

బర్డ్‌లో సౌకర్యాల లేమి!

శ్రీ బాలాజీ దివ్యాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్‌)లో సరైన వసతుల్లేక రోగులు అవస్థలు పడుతున్నారు. మూడేళ్లుగా క్యాంటీన్‌ అందుబాటు లేక ఆహార పదార్థాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.

Published : 22 Mar 2023 04:34 IST

మూడేళ్లుగా క్యాంటీన్‌, మందుల దుకాణాల కొరత

బర్డ్‌ ఆస్పత్రి భవనం

తిరుపతి(వైద్యం), న్యూస్‌టుడే: శ్రీ బాలాజీ దివ్యాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్రం (బర్డ్‌)లో సరైన వసతుల్లేక రోగులు అవస్థలు పడుతున్నారు. మూడేళ్లుగా క్యాంటీన్‌ అందుబాటు లేక ఆహార పదార్థాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. స్విమ్స్‌తోపాటు రుయాలో ఉచిత అన్న ప్రసాదాలు అందించే తితిదే.. తమ నిర్వహణలోని బర్డ్‌ ఆస్పత్రిలో ఉచిత ప్రసాదాలు అందజేయడం లేదు. ఉచితంగా అందక.. కొనుగోలు చేసేందుకు అవకాశం లేక రోగులు నానా పాట్లు పడుతున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక గదుల సమీపంలోనూ ఆహార పదార్థాలు అందుబాటులో లేవు.

బర్డ్‌ ఆస్పత్రికి దేశ వ్యాప్తంగా రోగులు వస్తుంటారు. ఎముకలు, మోకీళ్ల మార్పిడి, తుంటి, గ్రహణమొర్రి, గూనె శస్త్ర చికిత్సలతోపాటు పుట్టు అంగవైకల్యం ఉన్న వారికి ప్రత్యేక శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. రోజుకు సరాసరి 700 - 800 మంది ఓపీ నిమిత్తం వస్తుంటారు. ఇన్‌పేషంట్లుగా సుమారు 200 మంది ఉన్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రి వైద్యులతో పాటు దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులు సందర్శక వైద్యులుగా సేవలు అందిస్తున్నారు. దానికి తోడు దాతల సహకారంతో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో బర్డ్‌కు రోగుల సంఖ్య బాగా పెరిగింది.

అయినవారి కోసమా..

టెండర్‌ కాలపరిమితి పూర్తి కావడంతో బర్డ్‌ ఆస్పత్రిలో కొనసాగుతున్న క్యాంటీన్‌ 2019లో మూతపడింది. సమీపంలోని రుయా చిన్న పిల్లల ఆస్పత్రి, మెటర్నటీకి వచ్చే రోగులు కూడా ఇక్కడికి వచ్చి ఆహారపదార్థాలు కొనుగోలు చేసుకునేవారు. స్విమ్స్‌, బర్డ్‌ ఆస్పత్రి వైద్యులు ఇక్కడ అల్పాహారాలు, తేనీరు తీసుకునేవారు. అలాంటి క్యాంటీన్‌ అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యమైన ఆహారం కోసం ప్రధాన మార్గంలోకి రోగులు రావాల్సి వస్తోంది. అప్పటి నుంచి అనేకసార్లు టెండర్లు నిర్వహించినా ఖరారు చేయలేదు. పలుమార్లు ప్రయత్నించినా టెండరుదార్ల నుంచి సానుకూలత లేదనే కారణంతో అయిన వారికి కట్టబెడతారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. సమీపంలో ఉన్న స్విమ్స్‌ క్యాంటీన్‌ నిర్వాహకులకు మేలు చేసే ఉద్దేశంతో క్యాంటీన్‌ ఖరారు పెండింగ్‌ కొనసాగిస్తున్నట్లు విమర్శలున్నాయి.

రోగులకు ఇబ్బందులే..

బర్డ్‌ ఆస్పత్రి ముందున్న మందుల దుకాణంతో తితిదేకి నెలకు రూ.40 వేల వరకు అద్దె వచ్చేది. 2019లో అప్పటి తితిదే ఉన్నతాధికారి జనరిక్‌ మందుల దుకాణం పేరుతో అదే మందుల దుకాణాన్ని ఆస్పత్రి ఆవరణలోకి మార్చారు. మందుల దుకాణంలో వచ్చే ఆదాయాన్ని నిర్వాహకుడు, తితిదే సగం తీసుకునేలా ఒప్పందంతో నెలకొల్పారు. ఆ కాల పరిమితి పూర్తి కావడంతో ఆ తర్వాత మందుల దుకాణం అందుబాటులోకి రాలేదు. రోగులు మందుల కొనుగోలుకు స్విమ్స్‌ ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇటీవల టెండరు నిర్వహించినా ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. రానున్న వేసవి కాలంలో మరింతగా మంచి నీటి సౌకర్యాలు మెరుగుపరచాలని రోగులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని