తుపాకి పేల్చితే రాజీనామా అంటున్నారు.. ఇదేం కక్కుర్తి రాజకీయం: శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌లో తుపాకి పేల్చినట్టు వచ్చిన ఆరోపణలపై రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తోసిపుచ్చారు.

Updated : 14 Aug 2022 17:36 IST

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌లో తుపాకి పేల్చినట్టు వచ్చిన ఆరోపణలపై రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్లను తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తోసిపుచ్చారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జరిగిన సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ఒక ఘటన జరిగితే విచారణ ఉంటుందని, తాను పేల్చింది రబ్బర్‌ బుల్లెట్‌ అని స్పష్టం చేశారు.  కానీ, విపక్షాలు కక్కుర్తి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

సర్దార్‌ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, కుమురం భీం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ లాంటి మహనీయుల జయంతి వేడుకలు అన్ని వర్గాలు కలిసి చేసుకోవడం ద్వారా చక్కటి స్ఫూర్తిని చాటాలని కోరారు. అప్పుడే ఆ మహనీయుల ఆత్మ శాంతిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న తరుణంలో ఆయా వర్గాలకు మేలు చేయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా 52శాతంపైగా బీసీ జనాభా కలిగి ఉన్న దృష్ట్యా కనీసం ఇప్పటికైనా కేంద్రం బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడంతో పాటు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. లేదంటే రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనేక అంశాలపై శాసనసభలో తీర్మానాలు చేసి పంపినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలన్న ధ్యాస తప్ప కేంద్రలోని భాజపాకు మరొకటి లేదని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని