logo

మూడు ‘ఏ’లు.. ఉన్నతికి మార్గాలు

ఒక విద్యా సంస్థ ఉన్నతంగా ఎదిగేందుకు అకడమిక్స్‌ (ఏ), అడ్మినిస్ట్రేషన్‌ (ఏ), అకౌంట్స్‌ (ఏ).. ఈ మూడు ఎంతో కీలకం. ఈ మూడింటిపై దృష్టి పెడితే ఉన్నతంగా ఎదిగేందుకు వీలుంటుంది.

Published : 09 Dec 2022 04:43 IST

విద్యా, పాలన, ఆర్థిక అంశాల మెరుగుపై జేఎన్‌టీయూ దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: ఒక విద్యా సంస్థ ఉన్నతంగా ఎదిగేందుకు అకడమిక్స్‌ (ఏ), అడ్మినిస్ట్రేషన్‌ (ఏ), అకౌంట్స్‌ (ఏ).. ఈ మూడు ఎంతో కీలకం. ఈ మూడింటిపై దృష్టి పెడితే ఉన్నతంగా ఎదిగేందుకు వీలుంటుంది. ప్రస్తుతం జేఎన్‌టీయూ ఆయా 3 అంశాలపై దృష్టి పెట్టింది. ఇందుకుగాను ప్రత్యేకంగా వివిధ రంగాల నిపుణులతో ‘ఎఎఎ’ కమిటీని వర్సిటీ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి నియమించారు. నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈనెల 9, 10, 11 తేదీల్లో వర్సిటీని సందర్శించనుంది. కమిటీకి బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ గౌరవ ఆచార్యుడు కె.టి.జాకబ్‌ ఛైర్మన్‌గా వ్యవరించనుండగా.. సభ్యులుగా మంగళూరు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి కె.బైరప్ప, ఇంఫాల్‌ ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ కె.భాస్కర్‌, న్యాక్‌ మాజీ సలహాదారు బీఎస్‌ మధుకర్‌, ఐఐపీఎస్‌ మాజీ డైరెక్టర్‌ రామకృష్ణ వ్యాస్‌ ఉన్నారు. కమిటీకి అందించేందుకు వర్సిటీ తరఫున ప్రత్యేక ప్రగతి నివేదిక సిద్ధం చేసినట్లు కట్టా నర్సింహారెడ్డి తెలిపారు.

కమిటీ ఏం చేస్తుందంటే..?

కమిటీ సభ్యులు వర్సిటీని సందర్శించి విద్యా, పాలన, ఆర్థిక పరమైన అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తారు. విభాగాలతో వారీగా అధిపతులు, ఆచార్యులతో సమావేశమై వర్సిటీలోని అన్ని అంశాలు కూలంకషంగా తెలుసుకుంటారు. దాని ఆధారంగా వర్సిటీ ఏయే అంశాలల్లో బలంగా ఉంది..? ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి..? వాటిని ఏ విధంగా సరిచేసుకోవచ్చు.. సూచిస్తూ నివేదిక అందజేస్తారు. దాని ఆధారంగా వర్సిటీలో విభాగాల వారీగా ఉన్న లోపాలు సరిచేసుకునేందుకు వీలవుతుంది. వాస్తవానికి ఈ తరహా ‘ఎఎఎ’ కమిటీ సమీక్షలు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్లో తక్కువగా ఉంటాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువగా సమీక్షిస్తుంటారు. జేఎన్‌టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి గతంలో రెండు పర్యాయాలు మైసూరు విశ్వవిద్యాలయ ఎఎఎ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆ అనుభవంతో జేఎన్‌టీయూలోనూ కమిటీ ఏర్పాటు చేసి లోటుపాట్లపై సమీక్షించాలని నిర్ణయించారు.

ముగిసిన న్యాక్‌ గడువు

జేఎన్‌టీయూ వచ్చే ఏడాది న్యాక్‌ అక్రిడిటేషన్‌కు వెళ్లనుంది. 2017లో జేఎన్‌టీయూకు న్యాక్‌ ఏ గ్రేడ్‌ లభించగా.. ఈ సెప్టెంబరు 22తో ముగిసింది. 6 నెలల్లో మళ్లీ గుర్తింపునకు వెళ్లాలి. ఈసారి ఏ++ హోదా సాధించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో న్యాక్‌కు దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఎఎఎ’ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సమస్యలను పరిష్కరించుకుని దరఖాస్తు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని