logo

నేర వార్తలు

కన్న తల్లి మృతితో మనస్తాపానికి గురైన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Published : 10 Dec 2022 03:22 IST

అమ్మ మృతి.. మనస్తాపంతో బాలుడి ఆత్మహత్య

చేవెళ్ల గ్రామీణం: కన్న తల్లి మృతితో మనస్తాపానికి గురైన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... దామరగిద్దకు చెందిన మల్లేష్‌, పద్మలకు ఇద్దరు కొడుకులు. తల్లి అనారోగ్యంతో సంవత్సరంక్రితం మృతి చెందింది. చిన్న కుమారుడు కార్తిక్‌(13) అప్పటి నుంచిదిగులుగా ఉండేవాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.


పెట్టుబడి పేరిట మోసం.. నిందితుడికి మూడేళ్ల జైలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్ల క్రితం..పెట్టుబడులకు అధిక లాభాలు ఇస్తామని నమ్మించి రూ.30లక్షలు దండుకున్న మోసగాడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ 9వ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌(నాంపల్లి) తీర్పు వెలువరించారని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదర్‌గూడలో ఉండే వ్యాపారి హితేష్‌ భుపేందర్‌షా 2014లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రముఖ కంపెనీలడీలర్‌షిప్‌ ఇప్పిస్తామని, 10 నుంచి 12 శాతం వరకు రాబడి వస్తుందని ప్రకటనలు గుప్పించాడు. నమ్మిన గణేష్‌ చంద్రశేఖర్‌, జి.రమారమేష్‌, రమేష్‌ ఆయన్ని కలిశారు. రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌, బాలాజీ సూపర్‌ మార్కెట్‌ల పేరిట వివిధ వర్క్‌ఆర్డర్లు బాధితులకు చూపించాడు. 2014 మే 3న డీలర్‌షిప్‌ ఒప్పందం చేసుకుని రూ.30 లక్షలు దండుకున్నాడు. బాధితులు 2015లో నారాయణగూడ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు దర్యాప్తు చేశారు.  


ఆస్పత్రి నుంచి నగల వ్యాపారుల డిశ్ఛార్జి

నాగోలు, న్యూస్‌టుడే: నాగోలు స్నేహపురికాలనీలోని నగల దుకాణంలో దుండగుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందిన ఇద్దరు కోలుకోవడంతో సుప్రజ ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్ఛార్జి చేశారు. నవంబరు 1న రాత్రి మహాదేవ్‌ దుకాణంలోకి తుపాకీలతో చొరబడిన దుండగులు యజమాని కల్యాణ్‌ చౌదరితోపాటు, నగలను సరఫరా చేసే సుఖ్‌రామ్‌పై కాల్పులు జరిపి, ఆభరణాల బ్యాగును లాక్కుని పరారైన విషయం తెలిసిందే. గాయపడిన వారిని నాగోలు చౌరస్తాలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్సలుచేసి సుఖరామ్‌ శరీరంలో బుల్లెట్‌ తొలగించారు. బాధితులకు మెరుగైన సేవలు అందించి కోలుకునేలా చేసిన వైద్య బృందాన్ని ఆస్పత్రి ఎండీ విజయ్‌కుమార్‌ అభినందించారు.


కుమారునికి వైద్యం చేయించి తిరిగొస్తూ..
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

పటాన్‌చెరు అర్బన్‌: కుమారునికి అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం ఢీకొని తండ్రి మృతిచెందాడు. పటాన్‌చెరు ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌ బిల్లాస్పూర్‌నకు చెందిన దీపక్‌ సూర్యవంశీ(21) తన కుటుంబంతో బతుకు దెరువుకు నెల క్రితం ఇస్నాపూర్‌ వచ్చి హైనెస్ట్‌ అపార్ట్‌మెంట్‌లో కూలి పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఏడు నెలల కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల 8న రాత్రి భార్య రాణి, కుమారుడిని తీసుకుని ఓ క్లినిక్‌లో చూపించాడు. తిరిగివస్తూ జాతీయ రహదారి దాటుతుండగా బుల్లెట్‌ చోదకుడు  వేగంగా వచ్చి దీపక్‌ను ఢీకొట్టాడు. అతడు డివైడర్‌పై పడటంతో మృతి చెందారు.


రాజీవ్‌ రహదారిపై మరో ఘోర ప్రమాదం

అల్వాల్‌, న్యూస్‌టుడే: రాజీవ్‌ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది.  శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మిగతా వారు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం. హకీంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా ఉద్యోగం చేసే వెంకటేశ్‌(43) సింగాయి పల్లిలో భార్య కవిత పిల్లలు యశ్వర్దన్‌(10), మోక్ష(7)తో కలిసి ఉంటున్నారు. అత్త నిర్మల(55) బంధువులు సావిత్రి(62), లాస్య సంతానం శశాంక్‌, రెండు సంవత్సరాల పాపతో శుక్రవారం సాయంత్రం కారులో తూంకుంట వేడుకకు వెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వస్తున్నారు. ఎదురుగా గజ్వేల్‌వైపు వెళ్లుతున్న కాంట్రాక్టు ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకావడంతో అక్కడికక్కడే వాహనం నడిపిస్తున్న వెంకటేశ్‌ మృతి చెందగా సావిత్రి, నిర్మలతో పాటు మృతుడి పిల్లలు యశ్వర్దన్‌, మోక్ష, లాస్య కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. కేసు దర్యాప్తులో ఉంది.


అసభ్య కామెంట్లతో సామాజిక మాధ్యమాల్లో మహిళల చిత్రాలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో మహిళల చిత్రాలకు అసభ్య కామెంట్లను జతచేసి పోస్టులు పెడుతున్న ఇద్దరు యువకులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ పద్మ వివరాల ప్రకారం... పీర్జాదిగూడలో నివసించే శివకుమార్‌(20), ఏపీలోని ప్రొద్దుటూరు సమీప కొత్తపల్లికి చెందిన లింగారెడ్డి(25)లు సామాజిక మాధ్యమాల్లో రకరకాల పేర్లతో నకిలీ ఖాతాలు తెరిచారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పంపిస్తారు. ఎవరైనా అంగీకరిస్తే, వారి వ్యక్తిగత చిత్రాలను డౌన్‌లోడ్‌ చేసి అసభ్య కామెంట్లు జతచేసి నకిలీ ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్‌ సైబర్‌ ఠాణా  పోలీసులు దర్యాప్తు చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని