logo

ఆవిర్భావం.. ఆనంద తరంగం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లె, పట్టణాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

Published : 03 Jun 2023 01:12 IST

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లె, పట్టణాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ నాయకులు సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి సంబరాలు జరుపుకొన్నారు. భాజపా నాయకులు జెండాలను ఎగుర వేశారు.

న్యూస్‌టుడే, బృందం.


జాతీయ పతాకానికి వందనం చేస్తున్న జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి

తాండూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

కొడంగల్‌లో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి..


వికారాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిది వసంతాలు పూర్తయి, పదో వసంతంలోకి అడుగు పెడుతున్నామని, తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం అద్భుత విజయాలు సాధించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం మైదానంలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్ర సాధనకు ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయని పేర్కొన్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారన్నారు. రైతు ఏ కారణం చేతనైనా మృతి చెందితే, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా రైతుబీమా ద్వారా ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందిస్తోందని చెప్పారు. సాగుకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు. మహిళల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని అందించి ఇబ్బందులు తీర్చాం, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. వేడుకలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ కోటిరెడ్డి, పురఅధ్యక్షురాలు మంజుల, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌, న్యాయవాదులు

పరిగి క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి..

వికారాబాద్‌లో ఎమ్మెల్యే ఆనంద్‌

జెండావిష్కరణలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తదితరులు


సోనియాగాంధీ వల్లే తెలంగాణ: కాంగ్రెస్‌

పరిగి, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ అని  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తన నివాసం వద్ద జెండా ఆవిష్కరించారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని