logo

ప్రజలు మళ్లీ మోసపోవద్దు

భాజపా అభ్యర్థి అర్వింద్‌ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్‌-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు.

Published : 20 Apr 2024 04:39 IST

భాజపా, కాంగ్రెస్‌లను ఓడించాలి
బహిరంగ సభలో భారాస నేతలు

భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు సంఘీభావం తెలుపుతున్న కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, కల్వకుంట్ల సంజయ్‌, జగిత్యాల జిల్లా భారాస అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు

ఈనాడు, నిజామాబాద్‌: భాజపా అభ్యర్థి అర్వింద్‌ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్‌-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో బాజిరెడ్డి ప్రసంగించారు. మనమందరం రాముడిని కొలుస్తామని.. సకల సుగుణాలు ఉన్న పురుషోత్తముడి గురించి భాజపా నాయకులకు తెలియదన్నారు. ఆ మహా పురుషుడి పేరు చెప్పుకొని పాలన సాగించే మోదీ పేదలను విస్మరించారని విమర్శించారు. ఒకే కుటుంబం నుంచి తండ్రి-కొడుకులు ఎంపీలుగా ఉండటం అరుదుగా ఉంటుందని, ఆ అవకాశం దక్కిన అర్వింద్‌, ఐదేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి.. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇక్కడి ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోలేదన్నారు. ఐదేళ్లుగా ఇటువైపు రాని వ్యక్తి.. ఎంపీగా గెలిపిస్తే వస్తాడనే నమ్మకం లేదన్నారు. అసలు కాంగ్రెస్‌ రాజశేఖర్‌ రెడ్డితోనే పోయిందని.. ఇప్పుడు పాత కాంగ్రెసోళ్లు రేవంత్‌కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించానన్నారు. ఎంపీగా అవకాశమిస్తే ప్రజల గొంతును లోక్‌సభలో వినిపిస్తానన్నారు. మాజీ మంత్రలు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌, రాజ్యసభ ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి మహమూద్‌ అలీ, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల భారాస అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి అయేషా ఫాతిమా సభలో ప్రసంగించారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తప్పుడు కేసులతో భారాస నేతలను ఇబ్బంది పెడుతున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. చిన్న కేసులో తన కొడుకును చిత్రహింసలకు గురిచేసి.. రాజకీయ కక్ష సాధింపులకు దిగారని అయోషా ఫాతిమా పేర్కొన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

గులాబీ శ్రేణుల్లో జోష్‌..

అధికారం కోల్పోయాక భారాస తొలి బహిరంగ సభను శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించింది. చెప్పిన సమయం కంటే ఆలస్యమైనప్పటికీ.. పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరావటంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు ఉద్యమ కాలంలో మాదిరిగా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. అధిష్ఠానం నుంచి పెద్ద నాయకులు ఎవరూ రానప్పటికీ.. ఉన్న నాయకత్వమే పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తూ మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తితో పార్టీకి పూర్వవైభవం తేవడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చిన సందర్భంలో కార్యకర్తలు సానుకూల నినాదాలతో హోరెత్తించారు. గ్రామగ్రామన ప్రచారం ఉద్ధృతం చేసి నిజామాబాద్‌ స్థానాన్ని గెలుపించుకుందామని నాయకులు కోరారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, రెండు జిల్లాల జడ్పీ ఛైర్మన్లు విఠల్‌రావు, వసంత, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, నిజామాబాద్‌ మేయర్‌ నీతూ కిరణ్‌, జడ్పీటీసీ సభ్యులు జగన్‌, సుమన, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని