logo

Meter Reading: మీటరు రీడింగ్‌.. మీరే తీసుకోవచ్చు!

సాంకేతిక వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆయా శాఖల సేవల్లో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రత్యేక యాప్‌ల ద్వారా క్షణాల్లో సేవలు, పనులు చేసుకోవచ్చు. ఇంటి విద్యుత్తు మీటరు రీడింగు తీసుకోవచ్చు.

Updated : 28 Mar 2023 09:08 IST

గద్వాల న్యూస్‌టుడే

చరవాణిలో మీటర్‌ రీడింగ్‌ తీసుకుంటున్న వినియోగదారుడు

సాంకేతిక వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆయా శాఖల సేవల్లో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రత్యేక యాప్‌ల ద్వారా క్షణాల్లో సేవలు, పనులు చేసుకోవచ్చు. ఇంటి విద్యుత్తు మీటరు రీడింగు తీసుకోవచ్చు. ఈ అవకాశం ఆ శాఖ కల్పిస్తోంది. తాజాగా విద్యుత్తు శాఖ ‘మీ విద్యుత్తు బిల్లును మీరే ఇంటి నుంచి చెల్లించండి’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి. విద్యుత్తు బిల్లు డిజిటల్‌ లావాదేవీల రూపంలో చెల్లిస్తే బాగుంటుందని అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్‌ విధానంలో భాగంగా సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ తీసుకోవటంలో చాలా మందికి అవగాహన లేదు. అవగాహన లేక సకాలంలో విద్యుత్తు మీటర్‌ రీడింగ్‌కు సిబ్బంది రాని పక్షంలో పెనాల్టీల భారం మోస్తున్నారు.

స్లాబ్‌ మారకుండా చక్కటి అవకాశం

విద్యుత్తు సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఒక్కోసారి సిబ్బంది 5 రోజులు ఆలస్యంగా వస్తే యూనిట్లు పెరిగి స్లాబ్‌ మారి బిల్లు రెండింతలు అవుతుంది. అలాంటి వాటికి తావు లేకుండా వినియోగదారులే చరవాణి ద్వారా స్వతహాగా రీడింగ్‌ తీసుకోవచ్చు. ప్రతి నెలా ఏ తేదీన రీడింగ్‌ తీస్తారో వచ్చే నెలలో కూడా ఆ తేదీకి రెండు రోజుల ముందు లేదా తర్వాత సెల్ఫ్‌ రీడింగ్‌ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.


సంక్షిప్త సందేశం రూపంలో..

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ యాప్‌

చరవాణి ద్వారా మీటర్‌ రీడింగ్‌ తీయటం.. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం మాదిరిగానే టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ప్రత్యేక యాప్‌ ద్వారా డిజిటల్‌ విధానంలో బిల్లు చెల్లించవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ విధానం అమల్లోకి వచ్చినా వినియోగదారుల్లో అవగాహన లేక ఇప్పటి పదుల సంఖ్యలో వినియోగదారులు కూడా ఈ విధానంలో చెల్లింపులు చేయడం లేదు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఐటీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, దానికి క్లిక్‌ చేస్తే డాష్‌ బోర్డుపై కనిపించే వాటిలో సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌పై నొక్కాలి. నిర్ధారించుకోవటానికి మళ్లీ సబ్‌మిట్‌ చేసి ఎనిమిది సంఖ్యల యూనిక్‌ సర్వీస్‌ వివరాలు సరి చూసుకోవాలి. స్కాన్‌ కేడబ్లూహెచ్‌పై క్లిక్‌ చేస్తే వెంటనే భారత్‌ స్మార్ట్‌ సర్వీసెస్‌ యాప్‌లోకి వెళ్తుంది. దీనిని ఇన్‌స్టాల్‌ చేసి స్వయంగా మీటర్‌ రీడింగ్‌ తీసుకోవచ్చు రీడింగ్‌ తీసుకోని సబ్‌మిట్‌పై క్లిక్‌ చేసి చరవాణి సంఖ్య నమోదు చేయాలి. దానికి బిల్లు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది. అనంతరం అంతర్జాలం ద్వారా బిల్లు చెల్లించవచ్చు.


డిజిటల్‌ విధానం ప్రయోజనకరం

డిజిటల్‌ విధానం చాలా మంచిది. దీని వల్ల సమయం ఆదాతో పాటు స్లాబ్‌ మారకుండా బిల్లు చెల్లించవచ్చు. దీంతో పాటు చరవాణిలోనే మీరు వినియోగించుకునే యూనిట్లు కనిపిస్తాయి. ఎలాంటీ ఇబ్బందులు ఉండవు.

భాస్కర్‌, జిల్లా విద్యుత్తు శాఖ అధికారి, జోగులాంబ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని