logo

నేడు ఎర్రవల్లిలో జనజాతర

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది.

Published : 05 May 2024 02:25 IST

హాజరుకానున్న రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి

సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎస్పీ రితిరాజ్‌

ఇటిక్యాల, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. హెలికాప్టర్‌లో సాయంత్రం 3.30 గంటలకు పదో పటాలానికి చేరుకుని అక్కడి నుంచి సభా ప్రాంగణానికి 3.45కు వీరు రానున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ శాసన సభ్యులు సంపత్‌కుమార్‌ తెలిపారు. సభకు గద్వాల, అలంపూర్‌, వనపర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నారని, ఏర్పాట్లు ఆదివారం తెల్లవారుజాముకు పూర్తి కానున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

ఇబ్బందులు లేకుండా చూడాలి

సభ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు విధుల్లో ఉన్న పోలీసు ఉద్యోగులు సంయమనం పాటించాలని డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ సూచించారు. సభ స్థలాన్ని, వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు, 10వ పటాలంలోని హెలిపాడ్లను జిల్లా ఎస్పీ రితిరాజ్‌తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రూట్‌మ్యాప్‌ను, సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాటుల ప్రదేశాలను పరిశీలించారు. జాతీయ రహదారికి సమీపంలో సభ ఉండనుండటంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేయాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ సంతోష్‌, ఎస్పీ పరిశీలించి పలు సూచనలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని