logo

‘పది’ పరీక్షలకు 98 % హాజరు

పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల....

Updated : 24 May 2022 06:12 IST


మెదక్‌లోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రంలోకి వెళ్తూ..

మెదక్‌, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మొదటి భాష (పేపర్‌-1) పరీక్ష జరిగింది. తొలి రోజు 98.84 శాతం మంది హాజరయ్యారు. 11,393 మంది పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11,261 మంది పరీక్ష రాయగా, 132 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. 8.30కు లోపలికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెప్పి పంపించారు. డీఈవో రమేశ్‌ మెదక్‌, పాపన్నపేటలోని కేంద్రాలను తనిఖీ చేశారు. శివ్వంపేటలోని పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర మోడల్‌ స్కూల్‌ సొసైటీ (టీఎస్‌ఎంఎస్‌) డైరెక్టర్‌ ఉషారాణి తనిఖీ చేశారు.


జిల్లా కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

శస్త్రచికిత్స జరిగినా..

రామాయంపేట, కౌడిపల్లి, న్యూస్‌టుడే: రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌ గ్రామానికి చెందిన సంపత్‌ కుమార్‌కు ఏడు రోజుల క్రితం అపెండిక్స్‌ శస్త్రచికిత్స జరిగింది. అతడికి ఇంకా కుట్టు విప్పలేదు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యుల సాయంతో హాజరయ్యారు. రామాయంపేట పట్టణ శివారులోని ఆదర్శ పాఠశాలలో చదివారు. మాసాయిపేట మండలం కోనాయిపల్లి గ్రామానికి కె.శశివర్ధన్‌కు సైతం అపెండిక్స్‌ శస్త్రచికిత్స పది రోజుల కిందట జరిగింది. ఈయన కౌడిపల్లిలోని బీసీ గురుకుల పాఠశాలలో పరీక్ష రాశారు. తండ్రి మహేశ్‌ సాయంతో కేంద్రానికి వచ్చాడు.


తొలి రోజు సజావుగా ‘పది’ పరీక్షలు

99.61 శాతం విద్యార్థుల హాజరు

న్యూస్‌టుడే, సిద్దిపేట


జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల గేటుకు గడియారం..

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు 99.61 శాతం హాజరు నమోదైంది. మొత్తం 83 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. విద్యార్థులు గంటన్నర ముందు నుంచే కేంద్రాలకు చేరుకోవడం మొదలెట్టారు. మొత్తం 14922 మంది విద్యార్థులకు 14864 మంది హాజరయ్యారు. గంట ముందు నుంచే లోనికి అనుమతించారు. కొందరు విద్యార్థులు ఒక కేంద్రానికి బదులు సమీపంలోని మరో కేంద్రానికి వచ్చారు. తరువాత పరుగున నిర్దేశిత కేంద్రాలకు వెళ్లారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రథమ భాష పరీక్షలు నిర్వహించారు. మొదటి రోజు కావడంతో పెద్దసంఖ్యలో విద్యార్థుల కుటుంబ సభ్యులు తరలివచ్చారు. జిల్లా విద్యాధికారి డా.రవికాంత్‌రావు సిద్దిపేట, హుస్నాబాద్‌లోని నాలుగు కేంద్రాలను, జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని మూడు కేంద్రాలను పరిశీలించారు.


సిద్దిపేటలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థినులు


తండ్రిని కోల్పోయి..

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: తండ్రి మృత్యువాతపడిన మరుసటి రోజే పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన రాంపెల్లి అభినందనచారి హుస్నాబాద్‌ మండలం జిల్లెలగడ్డలోని గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తాపీ మేస్త్రీగా పని చేసే తండ్రి రాజమొగిలి.. కొప్పూరులో ఈనెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదే రోజు తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈక్రమంలో దుఃఖాన్ని దిగమింగుకుని.. హుస్నాబాద్‌లోని ఆదర్శ పాఠశాలలో పరీక్షకు హాజరయ్యాడు. తమది నిరుపేద కుటుంబమని, తల్లి రాజ్యలక్ష్మితో పాటు ఇద్దరు సోదరీమణులు ఉన్నట్లు ‘న్యూస్‌టుడే’కు విద్యార్థి తెలిపాడు.


‘స్ఫూర్తి’ చాటిన విద్యార్థిని

సిద్దిపేటకు చెందిన పదో తరగతి విద్యార్థిని స్ఫూర్తి ఏడాదిగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వెన్నుపూస సమస్యతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతువున్న ఈ విద్యార్థిని ఏడాదిగా ఇంటి వద్దే పదో తరగతి పాఠాలు ఆన్‌లైన్‌లో విన్నారు. వైద్యులు పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ.. పరీక్ష కేంద్రానికి వచ్చారు. విద్యా శాఖ అధికారుల అనుమతితో మరొకరిని సహాయకురాలిగా నియమించుకొని తొలి రోజు పరీక్ష రాశారు. ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రానికి తండ్రి శ్రీధర్‌తో కలిసి వచ్చిన ఆ విద్యార్థిని నిజంగానే స్ఫూర్తిని చాటారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట


సంగారెడ్డి జిల్లాలో.. తొలిరోజు సజావుగా పది పరీక్షలు


సంగారెడ్డిలో పరీక్ష కేంద్రంలో వరుసలో వెళుతున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం సజావుగా ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తరువాత పరీక్షలు జరుగుతుండడంతో విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం 8 గంటలకే కేంద్రాలకు తీసుకువచ్చారు. భయపడవ్దదని, ధైర్యంగా రాయాలని సూచనలు చేశారు. తొలి రోజు తెలుగు పరీక్షకు మొత్తం 22,555 మందికి 22,346 మంది పరీక్ష రాశారు. సంగారెడ్డిలోని కరుణ ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలను అదనపు పాలనాధికారి వీరారెడ్డి, కొండాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలను అదనపు పాలనాధికారి రాజర్షిషా, సంగారెడ్డి, కంది, సదాశివపేటలోని కేంద్రాలను జిల్లా విద్యాధికారి రాజేష్‌ పరిశీలించారు.


ఆఖరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసు...


బాలికను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న కానిస్టేబుల్‌

హత్నూర: బోర్పట్ల గ్రామానికి చెందిన గంగోత్రికి హత్నూరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఈ విషయంలో అవగాహన లేని గంగోత్రి హత్నూరలోని బాలురు ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంది. అప్పటికే విద్యార్థులంతా కేంద్రం లోపలికి వెళ్లారు. అక్కడి నోటీస్‌ బోర్డుపై తన హాల్‌టికెట్‌ సంఖ్య కనిపించకపోవడంతో ఆమె కంగారు పడింది. చీఫ్‌ సూపరింటెండెంట్‌ రాజిరెడ్డి గుర్తించి పరీక్ష కేంద్రం గురుకుల పాఠశాల అని చెప్పడంతో అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక బోరున విలపించింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ రవికుమార్‌ వెంటనే స్పందించి బాలికను తన ద్విచక్ర వాహనంపైన తీసుకెళ్లి ఆఖరి నిమిషంలో కేంద్రానికి చేర్చారు. కానిస్టేబుల్‌ సకాలంలో స్పందించి విద్యార్థినిని కేంద్రానికి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని