logo

ముంచుతున్న మాయగాళ్లు!

పార్ట్‌టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సాప్‌నకు మెసేజ్‌ వచ్చింది. దాన్ని ఓపెన్‌ చేయగానే.. పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్‌ నేరగాడి సందేశం ఉంది. 

Published : 30 Nov 2022 05:32 IST

పటాన్‌చెరు అర్బన్‌: పార్ట్‌టైం ఉద్యోగం కోసం వెతుకుతుండగా వాట్సాప్‌నకు మెసేజ్‌ వచ్చింది. దాన్ని ఓపెన్‌ చేయగానే.. పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ సైబర్‌ నేరగాడి సందేశం ఉంది.  దీన్ని నమ్మి అతను చెప్పిన విధంగా పెట్టుబడి పెట్టిన ప్రైవేటు కంపెనీ హెచ్‌ఆర్‌ ఉద్యోగి నిలువునా మోసపోయాడు. జ్ఞానరాజు పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో ఉంటూ.. మాదాపూర్‌లోని ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. పార్ట్‌టైం జాబ్‌కు వెతుకుతుండగా.. ఈ నెల 26న వాట్సాప్‌కు సందేశం వచ్చింది. అది టెలిగ్రాంలో ఓపెన్‌ అయ్యింది. జ్ఞానరాజు తొలుత రూ.1000 పెట్టుబడి పెట్టాడు. దీనికి రూ.1,200 వచ్చిందన్నాడు. అనంతరం రూ.5 వేలు పెడితే రూ.6,500 వచ్చిందన్నాడు. ఆ తర్వాత ఒక పోర్టల్‌ను తెరిపించాడు. అందులో వచ్చిన డబ్బు కనిపిస్తుందని చెప్పాడు. దీంతో రూ.80,000 ఒకసారి, రెండోసారి రూ.2.5 లక్షలు, ఇలా దఫదఫాలుగా రూ.6.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నలుగురు స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరో రూ.8.09 లక్షల వరకు మూడు రోజుల్లో పెట్టాడు. ‘పోర్టల్‌లో రూ.22.69 లక్షలు కనిపిస్తోంది.. కానీ విత్‌డ్రా చేసుకుందామంటే కావడం లేదని చెప్పడంతో అది క్రిప్టో కరెన్సీలో ఉందని భారత కరెన్సీలోకి మార్చేందుకు అదనంగా మరో రూ.3.5 లక్షలు చెల్లించాలన్నారు. మోసపోయానని గ్రహించిన జ్ఞానరాజు సైబర్‌ క్రైమ్‌ విభాగంతోపాటు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయడంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రుణం అంటూ.. : ఓ వ్యక్తి ఐదు సెకన్లలో రూ.5 లక్షల రుణం అని ఇస్తామన్న ప్రకటన చూసి మోసపోయాడు. ఈ ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. ముత్తంగికి చెందిన పాండు ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 25న పాండు తన ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయగా అందులో 5 సెకన్లలో రూ.5 లక్షల రుణం అనే ప్రకటన చూశాడు. అందులో సూచించిన నంబర్‌కు ఫోన్‌ చేశాడు. రుణం కావాలంటే ముందు రూ.2.5 వేలు చెల్లించాలన్నారు. దస్త్రాల ఖర్చు కింద రూ.4.5 వేలు, బీమా కింద రూ.18.9 వేలు, బ్యాంకు సపోర్టు చేయడం లేదని రూ.32 వేలు ఒకసారి, మూడుసార్లు రూ.32.5 వేలు, 15.5 వేలు, రూ.22.25 వేలు చెల్లింపు చేయాలని చెప్పడంతో వారు సూచించిన విధంగా నగదు జమ చేశాడు. మీసేవా నుంచి వారు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.50.40వేలు ఒకసారి, రూ.45 వేలు, రూ.26.3 వేలు ఇలా దఫాదఫాలుగా మొత్తం రూ. 2.48 లక్షలు వేశాడు. అనంతరం అవతల వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. మోసపోయాయని గ్రహించి పటాన్‌చెరు ఠాణాలో ఫిర్యాదు ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని