logo

చేతికందే స్థితి నుంచి చేదుకునే వరకు..!

జోరుగా సాగు.. అతిగా బోర్ల వినియోగం.. పైగా వేసవి కాలం.. ఫలితం భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి.

Published : 24 Mar 2023 04:44 IST

ఉమ్మడి జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: జోరుగా సాగు.. అతిగా బోర్ల వినియోగం.. పైగా వేసవి కాలం.. ఫలితం భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ప్రజలు ఈ విషయం  గమనించి బోర్ల వినియోగాన్ని తగ్గించినట్లయితే ఈ పరిస్థితి నుంచి కాస్తయినా బయటపడే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగానే కురియడంతో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉంటాయనుకున్నారు. కానీ రెండు నెలలుగా పరిస్థితి తలకిందులైంది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకొంతకాలం వ్యవసాయానికి బోర్ల వినియోగం ఉండటంతో ఇంకా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.

*  ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో బావుల్లో చేతికందే స్థాయిలో నీరు ఉంది. అయితే యాసంగి ఆరంభం నుంచే తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం నీటిని చేదుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బోర్లలో సైతం ఉబికివచ్చిన నీరు ప్రస్తుతం ఆగిఆగి వస్తున్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

*  సూర్యాపేట జిల్లాలోని నూతనకల్‌, నాగారం మండలాల్లో భూగర్భ నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి. గత ఏడాది నాగారంలో  2.75 మీటర్ల లోతులో ఉండగా ప్రస్తుతం 11.19 మీటర్లకు పడిపోయాయి. నూతనకల్‌ మండలంలో సైతం అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది 4.05 మీటర్ల లోతులో  ఉండగా.. ప్రస్తుతం 11.16 మీటర్ల లోతులో ఉన్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయని, భవిష్యత్తులో  ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని  దేవరకొండ, నకిరేకల్‌, మునుగోడు ప్రాంతాల్లో సైతం అదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. యాదాద్రి జిల్లాలో తుర్కపల్లి, అడ్డగూడురు, రాజపేట మండలాల్లో నీటి మట్టం పడిపోయింది.

తాగునీటికి ఇబ్బందులు తప్పవా!

గ్రామీణ ప్రాంతాలు బోర్లపై ఆధారపడటంతో..ఈ సారి తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేదని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో బోర్లు చాలా వరకు ఎండిపోయే పరిస్థితి. అధికారులు ఇప్పటి నుంచే మిషన్‌ భగీరథ నీటి ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు. వరికి సైతం మరో కొద్ది రోజులు నీటిని పెట్టాల్సి ఉంది. బోర్ల ఆగి పోస్తుండటంతో పూర్తి స్థాయిలో పొలానికి నీరు సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో చేసేది లేక చివరి పొలాన్ని వదిలేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో గత ఏడాది, ప్రస్తుత మార్చి నెలలో నీటి మట్టం వివరాలు (మీటర్లలో)
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని