logo

పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్‌ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి.

Updated : 27 Apr 2024 06:55 IST

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్‌ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కింది స్థాయి క్రియాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరూ తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. ఏది ఏమైనా లోక్‌సభ ఎన్నికల లోపే తమకంటూ ఓ వేదిక చూసుకునేందుకు నేతలు ఆరాటపడుతున్నారు. ఇప్పుడే పార్టీలో ప్రాధాన్యం పెంచుకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చక్రం తిప్పవచ్చనే భావనతో పద.. పదంటూ చేరికల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ముఖ్య నేతలే ముందు వరుసలో..

‘ఆ.. గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా..’ అని కాకుండా.. ఏగట్టైతే ఏంటి.. పదవి వస్తే చాలు అన్నట్టుగా మారిపోతున్నాయి రాజకీయాలు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరనే నానుడి ఇటీవలి రాజకీయ పరిణామాలను చూస్తే స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ముఖ్య నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పార్టీలు మారుస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పురపాలక ఛైర్మన్లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ సభ్యులు, మాజీ సర్పంచులతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులంతా వరుస కడుతున్నారు. ముఖ్య నేతలే ముందు వరుసలో ఉంటున్నారు. ఆరు నెలల క్రితమే అసెంబ్లీ పోరులో ఒకరిపై ఒకరు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకున్న వారు ఇప్పుడు ఒకే గొడుకు కిందకు వస్తుండటంతో సామాన్య ఓటరు ‘ఔరా.. ఇదేనా ఓట్ల రాజకీయం’ అనుకుంటున్నారు.

పల్లె పోరులో పట్టుకోసం..

పల్లె, పట్టణమనే తేడా లేకుండా కొందరు పూర్తి స్థాయి రాజకీయాలకు అంకితమయ్యారు. ఏదో ఒక పదవిలో ఉండాలనే ఆకాంక్ష వారిని పార్టీ ప్రతినిధులుగా మారుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఏ పార్టీ నుంచైతే ఏంటి రప్పించుకునేందుకు అధిష్ఠానాలు పచ్చజెండా ఊపుతున్నాయి. దీంతో పలువురు తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతున్నారు.  ఇప్పుడు క్రియాశీలకంగా ఉంటే వచ్చే మున్సిపల్‌, సర్పంచి, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సొసైటీల ఎన్నికల్లో తమ ఆధిపత్యమే ఉంటుందని విశ్వసిస్తూ అనుచరులతో కలిసి కండువాలు కప్పుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.   -  నాంపల్లి, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని