logo

సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం

శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Updated : 23 Apr 2024 07:50 IST

 రైతు బిడ్డ జీవన్‌రెడ్డిని పార్లమెంటుకు పంపండి

 ఇందూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌: శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జనజాతర సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చక్కెర కర్మాగారాలు తెరిపించే విషయంలో విధివిధానాలు ఖరారు చేసేందుకు పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన..జీవన్‌రెడ్డితో కలిపి కమిటీ వేసిన విషయం ప్రస్తావించారు. మూసి ఉన్న చక్కెర కర్మాగారం తలుపులు సెప్టెంబరు కల్లా తెరిపించే బాధ్యత తనదే అన్నారు. ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని..మరికొన్ని అమలు చేసేలోపే ఎన్నికల కోడ్‌ వచ్చేసిందన్నారు. జీవన్‌రెడ్డిని గెలిపిస్తే ఇండియా కూటమిలో వ్యవసాయశాఖ మంత్రిగా ఆయనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారన్నారు. వడ్లు కొనడం లేదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఎంత పండించినా కొనటంతో పాటు వచ్చే సీజన్‌ నుంచి రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు.

వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ తదితరులు

కవితను మించి అర్వింద్‌ను ఓడించండి..

వంద రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరిపిస్తానని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని విఫలమైన కేసీఆర్‌ కూతుర్ని ఇక్కడి రైతులు ఓడించారన్నారు. ఆ దెబ్బతో కోలుకోలేని స్థితిలో కవిత..ఎన్నికల్లో పోటీ చేయటానికే భయపడినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత గెలిచిన భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసగించారన్నారు. వంద రోజుల మోసానికే ఆ తీరున బుద్ధి చెప్పిన ఇక్కడి రైతులు.. కేవలం అయిదు రోజులు అంటూ మోసగించిన అర్వింద్‌ను అంతకు మించి ఓడించాలని కోరారు. సుగంధ ద్రవ్యాల బోర్డునే పసుపు బోర్డుగా నమ్మించి బుకాయించే ప్రయత్నం చేశారన్నారు. తాతకు దగ్గు నేర్పినట్లు.. రైతుల దగ్గర అబద్ధం అడితే తెలుసుకోలేరనుకోవడం అవివేకం అన్నారు. వ్యవసాయం తెలియని అర్వింద్‌ను గెలిపించుకుంటే.. పల్లికాయలు ఏడ కాస్తాయంటే చెట్టుపైన అంటాడంటూ ఎద్దేవా చేశారు. రైతు కష్టాలపై అవగాహన లేని అర్వింద్‌ కంటే.. స్వయాన రైతు జీవన్‌రెడ్డిని గెలిపిస్తే మీలో ఒకడిగా ఉండిపోతారన్నారు.

నిజామాబాద్‌పై ప్రత్యేక అభిమానం

ఆర్మూర్‌లో 2021లో నిర్వహించిన పసుపు రైతుల దీక్షతో అధిష్ఠానం వద్ద గుర్తింపు లభించి పీసీసీ పగ్గాలు అప్పగించిందన్నారు. తనకు అండగా నిలిచిన ఈ ప్రాంతమన్నా, ఇక్కడి రైతులన్నా తనకు ప్రత్యేక అభిమానమని చెప్పారు. దశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ జైలు గోడలపై రాసి ఈ జిల్లా ఖ్యాతిని ఇనుపడింపజేశారన్నారు. బాక్సింగ్‌లో నిఖత్‌ జరీన్‌, పర్వతారోహణతో మలావత్‌ పూర్ణ, పలువురు రాజకీయ నాయకులు జిల్లా కీర్తిని చాటారన్నారు. ప్రజాజీవితంలో విశేష అనుభవం కలిగిన జీవన్‌రెడ్డిని ఎంపీగా పంపితే జిల్లా పేరును నిలబెడతారన్నారు. జీవన్‌రెడ్డికి వేసే ఓటు తనకు వేసినట్లే అని.. ఆయన గెలుపునకు రైతులు, యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పెట్టుబడి వర్గాలకు.. రైతులకు మధ్య ఎన్నికలు

అన్నివర్గాలకు సమన్యాయం, సంక్షేమం అందించటం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. ప్రత్యర్థి పార్టీలు గడిచిన పదేళ్లలో రైతు సమస్యలు విస్మరించాయని పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం బాండ్‌ పేపర్‌ రాసిచ్చి అయిదేళ్లు కాలయాపన చేసిన అర్వింద్‌.. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ అక్టోబరు 4న బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తాం..ఎప్పుడు ఏర్పాటు చేస్తామనే వివరాలు లేకుండా రాసివ్వటమంటే మళ్లీ మోసం చేయటమే అన్నారు. నాడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ను వైఎస్సార్‌ అధికారంలోకి తెచ్చారని..నేడు రేవంత్‌రెడ్డి తెచ్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. మైనార్టీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ గాంధీని ప్రధాని చేసేందుకు మనమంతా పనిచేయాలని, రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ తెలిపారు. భాజపా నల్ల చట్టాలు తెచ్చింది, ఆ పార్టీ రైతు వ్యతిరేకి అని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బాజిరెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని