logo

ప్రభుత్వ విధానాలతో ఆక్వాలో సంక్షోభం

విద్యుత్తు ఛార్జీ రాయితీ అంటూ లేనిపోని నిబంధనలు అమలు చేస్తుండటంతో ఆక్వా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అసంబద్ధ విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకున్నారని రొయ్య రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ డి.గోపీనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 01 Apr 2023 04:12 IST

సమావేశంలో మాట్లాడుతున్న గోపీనాథ్‌.. చిత్రంలో ఆక్వా హేచరీస్‌ సంఘం ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యుత్తు ఛార్జీ రాయితీ అంటూ లేనిపోని నిబంధనలు అమలు చేస్తుండటంతో ఆక్వా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అసంబద్ధ విధానాల కారణంగా సంక్షోభంలో చిక్కుకున్నారని రొయ్య రైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ డి.గోపీనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హేచరీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. పది ఎకరాల్లోపు ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే సరఫరా చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో 80 శాతం మందికి ఆ విధానాన్ని తొలగించినట్టు తెలిపారు. డీకేటీ భూముల్లో సాగు చేసే చెరువులకు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని వాటికి, ప్రభుత్వ భూములకు రాయితీ తొలగించినందున విద్యుత్తు రాయితీ ప్రయోజనాన్ని కేవలం 20 శాతం మంది మాత్రమే పొందుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎక్కువమంది తీరప్రాంతంలోని వృథా భూముల్లో ఉప్పునీటి ఆధారంగా, చిన్న, సన్నకారు రైతుల భూములు లీజుకు తీసుకుని రొయ్యల చెరువుల సాగు చేపట్టినట్టు తెలిపారు. వీరికి ప్రారంభంలో రాయితీ ఇచ్చి ఇప్పుడు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. విద్యుత్తు బిల్లుల భారం మోయలేక పలువురు ఇప్పటికే ఆక్వా సాగు విరమించుకున్నారని, మరికొందరు నష్టాల బారిన పడ్డారన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన రాయితీని కూడా తిరిగి చెల్లించాలంటూ విద్యుత్తు బిల్లుల్లో కలిపి నోటీసు ఇస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. హేచరీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు అల్లూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. హేచరీలను సముద్రతీరానికి సమీపంలో నిర్వహించకూడదని ఆంక్షలు పెట్టడం వల్ల నిర్వాహకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీఆర్‌జడ్‌, కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ ఇష్టానుసారం నిబంధనలు విధిస్తుండటం కారణంగా హేచరీల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపారు. ఇప్పటికే పలువురు మూసివేయగా, మరికొందరు ఉత్పత్తి తగ్గించుకున్నారన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రతినిధులు పి.సుబ్బారావు, ఎన్‌.సుభాజీ, టి.వెంకట్రావు, ఎస్‌.అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని