logo

అగ్రనేతల ఆగమనం

భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

Published : 19 Apr 2024 04:59 IST

ఇక హోరెత్తనున్న ప్రచారం.. 
ఈనాడు, వరంగల్‌

భారీ సభా వేదికలు ముస్తాబవుతున్నాయి. వెల్లువలా ప్రజల్ని తరలించేందుకు రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. చేసిన అభివృద్ధిని వివరించేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. హామీల అమలును ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.. మొత్తానికి తమ ఉపన్యాసాలతో మాటల తూటాలు పేల్చనున్నారు. 

వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి పార్టీల అగ్రనేతలు  వరుసకట్టనున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు   హోరెత్తనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నుంచి మొదలుకొంటే  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, భారాస అధినేత కేసీఆర్‌ ఆయా పార్టీల కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఓరుగల్లుకు రానున్నారు.


ముఖ్యమంత్రితో మొదలు 

అధికార కాంగ్రెస్‌ ఉమ్మడి వరంగల్‌లోని రెండు స్థానాలపై గురిపెట్టింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే రెండు సభలు ఖరారయ్యాయి. శుక్రవారం మానుకోటలో పార్టీ అభ్యర్థి బలరాం నాయక్‌ తరఫున  భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. 24వ తేదీన వరంగల్‌ అభ్యర్థిని కడియం కావ్య తరఫున హనుమకొండలోని మడికొండ సభలో ప్రసంగిస్తారు. అభ్యర్థులు నామినేషన్లు వేసే రోజే ముఖ్యమంత్రి సభలు ఉండేలా షెడ్యూలు ఖరారు చేశారు.  తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరంగల్‌, మానుకోట సభల్లో పాల్గొంటారు. త్వరలో ఈ షెడ్యూలు వస్తుందని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు.


ప్రధాని మోదీ రాక కోసం..

వరంగల్‌ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ అట్టహాసంగా నామపత్రాలు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్‌ 24న  నామపత్రాలు వేసే ముందు హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ హాజరవుతున్నారు.  వరంగల్‌ లోక్‌సభపై కమలం గట్టి అంచనాలతో ఉన్నందున ప్రచారానికి ఏప్రిల్‌ చివరి వారం లేదా మే మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని భాజపా శ్రేణులు చెబుతున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్‌  కూడా  సభలు, రోడ్డు షోల్లో పాల్గొనేలా ప్రణాళిక రచిస్తున్నారు. మోదీ సభ వరంగల్‌లో ఏర్పాటుచేయాలని కోరుతూ  తాము లేఖ రాశామని వరంగల్‌ జిల్లా భాజపా అధ్యక్షుడు గంటా రవి తెలిపారు.  


రెండు చోట్ల కేసీఆర్‌

భారాస అధినేత కేసీఆర్‌ వరంగల్‌, మహబూబాబాద్‌ రెండు చోట్ల సభల్లో పాల్గొననున్నారు. వరంగల్‌ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, మానుకోట అభ్యర్థిని కవిత తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. గులాబీ అధినేత పర్యటన షెడ్యూలు ఇంకా ఖరారు కాలేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఏప్రిల్‌ 23న వర్ధన్నపేటలో అసెంబ్లీ నియోజవర్గ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ర్యాలీలు, రోడ్డు షోల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం ఉమ్మడి వరంగల్‌లో పలుమార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా భారాస ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని