విధులకు రాకున్నా వేతనాలు

ఏలూరు నగర పాలక సంస్థలో మరో విచిత్రం వెలుగు చూసింది. ఎవరైనా పనిచేసి జీతం తీసుకుంటారు. ఇక్కడ మాత్రం చాలామంది హాజరు వేసుకుని కథ నడిపిస్తున్నారు.

Updated : 03 Jun 2023 05:30 IST

నగరపాలక సంస్థలోమరో సిత్రం
మామూళ్ల మత్తులోఅధికారుల చోద్యం!
ఈనాడు డిజిటల్‌, ఏలూరు

ఏలూరు నగర పాలక సంస్థలో మరో విచిత్రం వెలుగు చూసింది. ఎవరైనా పనిచేసి జీతం తీసుకుంటారు. ఇక్కడ మాత్రం చాలామంది హాజరు వేసుకుని కథ నడిపిస్తున్నారు. అంతేకాదు.. వీరు వేరే ఉద్యోగాలూ చేసుకుంటున్నారు. కొందరైతే కాంట్రాక్టులూ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మామూళ్లు తీసుకొని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ప్రజారోగ్య విభాగంలోని ఓ డివిజన్‌ పరిధిలో పనిచేసే ఇద్దరు అవుట్‌ సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులు అసలు విధులకే హాజరుకారు. వారికి కేటాయించిన ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణతో వారికి పనిలేదు. ఒక్కొక్కరికి రూ.21 వేల జీతం ఠంఛనుగా పడుతుంది. సంబంధిత అధికారికి నెలకు ఇద్దరూ కలిపి రూ.10 వేలు ముట్టజెబుతున్నారు. మరో ఆశ్చర్యం ఏంటంటే వీరిద్దరు నగరంలోని ఓ రెస్టారెంట్లో నెలకు రూ.15 వేల జీతానికి సర్వర్లుగా పనిచేస్తున్నారు. ఇలాంటి సిబ్బంది  నగర పాలక సంస్థ పరిధిలో పదుల సంఖ్యలో ఉన్నారు. కొందరు రెస్టారెంట్లలో పని చేస్తుంటే.. మరికొందరు నాయకుల అండతో కాంట్రాక్టులు చేస్తున్నారు.

* పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించాల్సిన ఓ ఉద్యోగి విధులకు రాకున్నా హాజరు వేసి జీతం జమ చేస్తున్నారు. నాయకుల అండతో ఆర్టీసీలో పార్సిల్‌ కాంట్రాక్టర్‌గా మరో మార్గంలో సంపాదించుకుంటున్నారు. విధులకు హాజరు కాకపోవడమే కాకుండా సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు చేస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో ఇతను జనన మరణాల విభాగంలో తప్పుడు పత్రాలు సృష్టించిన విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇతను ఈ విభాగంలో కనిపిస్తే క్రిమినల్‌ కేసు పెడతానని సాక్షాత్తు జేసీ హెచ్చరించారు. అయినా నాయకుల ఆశీస్సులతో ఇప్పటికీ ఆ విభాగాన్ని వదల్లేదు.

అధికారులకు పట్టదు

కార్పొరేషన్‌ పరిధిలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ విభాగాల్లో పని చేసే కిందిస్థాయి సిబ్బంది వెయ్యి మందికిపైనే ఉంటారు. వీరిలో బినామీలను పెట్టుకుని పనులు చేయించేవారు వందకు పైనే ఉన్నారు. దాదాపు 40 మంది అసలు విధులకు హాజరు కారు. వీరి తరఫున బినామీ సిబ్బంది కూడా పనిచేయరు. నగర పరిధిలోని కృష్ణా కెనాల్‌ పారిశుద్ధ్య పనులు చేసేందుకు 20 మంది సిబ్బందిని కేటాయిస్తే వారిలో నలుగురు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఆయా విభాగాల్లో అధికారులకు ప్రతి నెలా మామూళ్లు అందుతుండటంతో కనీస చర్యలు తీసుకోవడం లేదు.

హమ్మయ్య హాజరు వేశాం

నగర పాలక సంస్థలో చాలా మంది సిబ్బంది విధులకు రావడం లేదు. ప్రతిరోజు ఉదయం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో హాజరు వేసుకుని.. ఆ రోజుకు పనైపోయింది అనుకుంటున్నారు. ఇలా చేసే వారిలో ఎక్కువగా ప్రజారోగ్య, ఇంజినీరింగ్‌ విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినిని ఓ పార్కు గార్డెనర్‌గా నియమించారు. ఆమె చాలా నెలల నుంచి హాజరు వేసుకుని విధులకు రావడం లేదు. జీతం మాత్రం పడిపోతోంది. అధికారులకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేసి తాపీగా సొంత పనులు చేసుకుంటున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో ఈ తరహా సిబ్బంది  ఉన్నారు. వీరంతా అధికారులకు భారీగా ముడుపులు అందిస్తున్నారు. శాశ్వత ఉద్యోగులకు జీతం ఎక్కువ కాబట్టి విధులకు హాజరు కానివారు బినామీలతో పనులు చేయిస్తున్నారు. బినామీలకు రూ.10 వేలు ఇచ్చి వారు మాత్రం వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు చేసుకుంటున్నారు. అధికారులకు ఒక్కో ఉద్యోగి నెలకు రూ.10 వేల వరకు ఇస్తున్నారని తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్‌ సిబ్బందీ రూ.5 వేలు అందజేస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల వరకూ వాటాలున్నట్లు సమాచారం.

* ఈ విషయమై నగర కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణను వివరణ కోరగా పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనితీరును తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. హాజరు కాని, బినామీలతో పనులు చేయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని